జగన్ ఓ కేడీ: బిజెపిలోకి మారెప్ప, జైల్లో పెడ్తాం: పవన్
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికెడి అని, నమ్మితే నట్టేట ముంచేస్తారని మాజీ మంత్రి మారెప్ప శనివారం నిప్పులు చెరిగారు. ఆయన భారతీయ జనతా పార్టీ సీమాంధ్ర చీఫ్ కంభంపాటి హరిబాబు సమక్షంలో విశాఖలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆయన పద్ధతి నచ్చకనే తాను ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. ఆయన పద్ధతి నచ్చకనే కొండా సురేఖ, సబ్బం హరి వంటి కీలక నేతలు దూరమయ్యారన్నారు. జగన్కు నీతి, నిజాయితీలు కొంచెం కూడా లేవన్నారు. జగన్ పార్టీలో దళితులకు న్యాయం జరగడం లేదని, కోట్లాది రూపాయలకు టిక్కెట్లు అమ్ముకుంటూ జగన్ రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేపో మాపో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
జైల్లో పెడతారు: పవన్
ఎన్డీయే అధికారంలోకి వస్తే జగన్ను జైల్లో పెడతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం టెక్కలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించిన మాట్లాడారు. జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని, ఎప్పటికైనా జైలుకెళ్లే జగన్ సిఎం కావాలా అని ప్రశ్నించారు. సీమాంధ్రులను కించపర్చేలా కెసిఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజాసేవ కోసమే ప్రచారం చేస్తున్నాని తెలిపారు.
తెలుగు జాతి ఐక్యత కోసమే తన ప్రయత్నమన్న పవన్ తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మే అన్నారు. ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలను కోరారు. నిజాయితీగా టిడిపికి ఓటెయ్యండని పిలుపునిచ్చారు. మోడీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందన్నారు.