ఉదయ్కిరణ్లా ఆత్మహత్య: జగన్పై మారెప్ప సంచలనం
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మారెప్ప మంగళవారం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పార్టీలో టిక్కెట్లు ఆశించిన చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, తాను పిరికివాడిని అయితే హీరో ఉదయ్ కిరణ్లా ఆత్మహత్య చేసుకునేవాడినన్నారు.
తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న అభిమానంతో జగన్ వెంట ఉన్నానని కానీ, పార్టీలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. రెడ్లకే పార్టీలో ప్రాధాన్యత ఉందని ఆరోపించారు. తనను పార్టీ కరివేపాకులా వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
ముందు నుండి పార్టీలో ఉండి పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అది సరికాదన్నారు. మొదటి నుండి ఉన్న వారిని గుర్తించాలన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నుండి వచ్చిన వారిని అందలమెక్కించవద్దన్నారు.
తెలంగాణపై...
హైదరాబాదులోని కేవలం పన్నెండు కార్పోరేట్ కుటుంబాలే విభజనను వ్యతిరేకిస్తున్నాయని మారెప్ప విమర్శించారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలన్నారు. చిన్నా రాష్ట్రాల ఏర్పాటులో ఎలాంటి తప్పు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేమని చెప్పారు.