తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటున్న గంజాయి... భద్రాచలంలో 6 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. రోజుకో చోట గంజాయి అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ,ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా పరిసరాల్లోనూ, తెలంగాణా రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గంజాయి జోరుగా సాగవుతోంది. ఏ జిల్లాలో చూసిన గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం జరుగుతోంది.
అక్రమ రవాణాకు కాదేదీ అనర్హం అంటున్న గంజాయి స్మగ్లర్లు
గంజాయి అక్రమ రవాణా చేయడానికి అంబులెన్సులను లారీలను మాత్రమే కాదు అంతుచిక్కని విధంగా వాహనాలను ఉపయోగిస్తూ స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇక గంజాయి ట్రాఫికర్లు యువతను, విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారిని మత్తుకు బానిసలను చేస్తున్నారు. విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది అనడానికి తాజాగా వరుసగా పట్టుబడుతున్న గంజాయి వాహనాలే ఉదాహరణ.
గంజాయికి బానిసైన యువత అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో బాలికపై అత్యాచారం చేసింది కూడా గంజాయి ట్రాఫికర్ లే కావటం గమనార్హం .
భద్రాచలం లో 6 క్వింటాళ్ళ గంజాయి పట్టివేత
తాజాగా ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా పరిసరాలలో సేకరించిన గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. గోదావరి బ్రిడ్జి సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద అటవీ, పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున ఓ డీసీఎం వ్యానులో భారీగా గంజాయి పట్టుబడింది. వ్యాన్లో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులు గంజాయిని గుర్తించగానే నిందితులు వ్యాన్ను వదిలిపారిపోయారు. పోలీసులు గంజాయి ప్యాకెట్లను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 6 క్వింటాళ్ల గంజాయి ధర మార్కెట్లో రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా.
బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్
గంజాయి సాగు చేస్తున్న క్షేత్రాలపై దాడులు చేస్తే అక్రమరవాణాకు అడ్డుకట్ట
ఇటీవల విశాఖ జిల్లాలో అంబులెన్స్ లో తరలిస్తూ భారీగా గంజాయి పట్టుపడింది. మొన్న బొగ్గు లారీ లో తరలిస్తున్న గంజాయిని సిద్దిపేటలో పట్టుకోగా, ఇక ఇప్పుడు వ్యాన్ లో తరలిస్తున్న గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఇలా వరుస ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా ఎంతగా జరుగుతుందో తేటతెల్లం చేస్తున్నాయి. గంజాయిని సాగుచేస్తున్న క్షేత్రాలలోనే సమూలంగా నాశనం చేసే ప్రయత్నం జరిగితే, ఇంత పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండదు. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయి భావితరాల భవిష్యత్తును ఛిద్రం చేయకుండా ఉండాలంటే ముందు గంజాయి సాగు చేస్తున్న క్షేత్రాల పై దాడులు జరగాలి. ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలి.