తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠా
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబులెన్స్ లో భారీగా గంజాయి అక్రమరవాణా జరిగితే, తాజాగా బొగ్గు లారీలో గంజాయి రవాణా కలకలం సృష్టిస్తోంది. అటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నప్పటికీ, అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ వీరిని పట్టుకోవడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలమవుతున్నారు.ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో, ఎవరికీ అర్థం కాని విధంగా గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
మొన్న అంబులెన్స్ ....నేడు బొగ్గు లారీలో గంజాయి అక్రమరవాణా
అంబులెన్స్ లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని పట్టుమని పదిరోజులు కాకముందే తాజా ఘటన జరిగింది. బొగ్గు లారీలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు భారీగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సిద్దిపేటలో అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని.. ఈ క్రమంలో సిద్దిపేట వద్ద ఓ లారీలో 621.3కేజీల గంజాయిని పట్టుకున్నామని అధికారులు తెలిపారు.
అనుమానం రాకుండా తెలివిగా అక్రమ రవాణా ... బొగ్గు లోడ్ కింద పాలిథీన్ బ్యాగుల్లో గంజాయి
నిందితులు తెలివిగా లారీలో బొగ్గు లోడ్ కింద పాలిథీన్ బ్యాగుల్లో గంజాయిని ఉంచి తరలిస్తున్నట్టుతెలుస్తుంది . చూసేవాళ్లకు బొగ్గు లోడ్తో వెళ్తున్న లారీలా కనిపించేందుకు ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం.విశాఖ ఏజెన్సీ నుంచి వికారాబాద్లోని తాండూరుకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. లారీతో పాటు దాని ఎస్కార్ట్గా వెనకాలే వస్తున్న మరో కారును కూడా సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.93,19,500 ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వారం రోజుల క్రితం అంబులెన్స్ లో గంజాయి తరలింపు ఘటన
అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ వారం రోజుల క్రితం ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విశాఖ లో అంబులెన్స్ లో తనిఖీలు చేపట్టి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. స్మగ్లర్ నుఅదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు.విశాఖ పట్నం సమీపంలోచెన్నై-కలకత్తా హైవేపై ఓ అంబులెన్స్ భారీఎత్తున గంజాయి తరలిస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దీంతో అంబులెన్స్ ను వెంబడించి సబ్బవరం వద్ద ఆపారు. అందులో తనిఖీ చేపట్టిన అధికారులు 1813 కేజీల గంజాయిని గుర్తించారు. దీన్ని స్వాధీనం చేసుకుని అధికారులు నిందితుడినిస్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో రూ.2,71,95,000 ఉంటుందని అధికారులు చెప్పారు.
విశాఖ ఏజెన్సీ నుండే గంజాయి దందా..... పట్టు పెడితేనే కేసులా.. పూర్తి నిర్మూలన అవసరం
విశాఖ ఏజెన్సీ వేదికగా పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు తాజాగా జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమవుతుంది. గంజాయి అక్రమ రవాణాకు తెలుగు రాష్ట్రాల కేంద్రంగా హైటెక్ ముఠా పని చేస్తుందని అర్థమవుతుంది. తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా పట్టుబడిన వాహనాలు మినహాయిస్తే ఈ దందాకు సంబంధించిన ముఠా పై ఉక్కుపాదం మోపి మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయి నుండి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, సంబంధిత శాఖల పైన ఉంది. అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , నార్కోటిక్స్, రెవెన్యూ అధికారులు గంజాయి సాగును, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయటంలో దారుణంగా విఫలం చెందుతున్నారు. కేవలం పట్టుబడిన వాహనాలపైనే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా ఈ గంజాయి దందాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేలా చూడాల్సిన అవసరం ఉంది.