విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి రవాణా .. లారీలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు
ఏపీలోని విశాఖ ఏజెన్సీ గంజాయి సాగుకు, గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది . ఒక పక్క కరోనా మహమ్మారితో రాష్ట్రం పోరాటం చేస్తున్న సమయంలో కూడా గంజాయి గుప్పుమంటుంది . గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్న అక్రమార్కులు నిత్యం ఏదో ఒక విధంగా గంజాయి రవాణా సాగిస్తున్నారు, మొన్నటికి మొన్న చేపల లోడుతో వెళ్ళే లారీలో గంజాయి రవాణా చేసి పట్టుబడిన ఘటన మరువకముందే మరోసారి లారీలో భారీగా గంజాయి పట్టుబడింది.
విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి రవాణా నిత్య కృత్యంగా మారింది. ఎవరు, ఎందులో, ఎప్పుడు, ఎలా గంజాయి తీసుకు వెళ్తున్నారో పోలీసులకు అంతు చిక్కటం లేదు . ఇక నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తమిళనాడుకు లారీలో ఈ గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం . పక్కా సమాచారంతో పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.
లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో జరిపిన వాహన తనిఖీల్లో కూడా లారీలోనే గంజాయి పట్టుబడింది.
కృష్ణా జిల్లాలోని కంకిపాడు గాయత్రీ విహార్ సమీపంలో 290 కేజీల గంజాయిని ఒక చేపల లోడుతో వెళ్తున్న లారీలో పోలీసులు పట్టుకున్నారు. ఆకివీడు నుంచి చేపలలోడుతో విజయవాడ వైపు వెళ్తున్న లారీలో గంజాయిని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇక రెండు రోజుల క్రితం బీటెక్ స్టూడెంట్స్ గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. అడ్డంగా బుక్కయ్యారు.