తలసానితో సై: మర్రి, దానంకు చురక: ప్రకాశంజిల్లా వేడుకల్లో అపశృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదిస్తే సనత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాజీ మంత్రి దానం నాగేందర్ తన పైన చేసిన ఆరోపణలను ఆశీర్వాదంగా భావిస్తానని చెప్పారు.
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: ఎల్ రమణ
ఎఱ్రగడ్డ ఛాతి ఆసుపత్రిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం సందర్శించారు. ఛాతి ఆసుపత్రి స్థలంలో సచివాలయ నిర్మాణాన్ని వారు వ్యతిరేకించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు సందర్శించారు.
ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. ఛాతి ఆసుపత్రిని తరలించాలని చూస్తే ప్రజలు ఉద్యమిస్తారన్నారు. పేదల సౌకర్యార్థం ఆసుపత్రిని ఇప్పుడున్న స్థలంలోనే ఉంచాలన్నారు. కేసీఆర్ దివాళాకోరు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. సచివాలయాన్ని మార్చాలనుకుంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. హామీలు అమలు చేసే సత్తాలేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్సించారు.
తెలంగాణ రాష్ట్రానికి వాస్తు దోషం లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే పెద్ద దోషమని మోత్కుపల్లి అన్నారు. నిజాం వారసుడిగా ప్రవర్తిస్తున్నాడన్నారు. సచివాలయానికి వాస్తుదోషం ఉందని చెప్పడం సరికాదన్నారు.
ప్రజలకు ఏం కావాలో కేసీఆర్కు తెలుసు: తుమ్మల
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుసునని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు.
ప్రకాశం జిల్లా అవతరణ వేడుకల్లో అపశృతి
ప్రకాశం జిల్లా అవతరణ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శిద్ధారాఘవ రావు పాలొన్న ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగువేశారు. జిల్లా ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో అవతరణ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి శిద్ధారాఘవ రావు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే జెండాను తప్పుగా కట్టడంతో జెండా తలిక్రిందులాగా ఎగిరింది. దీన్ని గుర్తించిన జిల్లా అధికారులు, మీడియా సిబ్బంది వెంటనే సమాచారం అందించటంతో జెండాను కిందకు దించి యథావిధిగా ఎగురవేశారు.