అంతా వట్టిదే: కిరణ్కు మర్రి కౌంటర్, ఢిల్లీ పెద్దలపై గంటా
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన జరిగితే ఎన్నో సమస్యలు వస్తాయన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి బుధవారం స్పందించారు. విభజన జరిగితే రాజకీయంగా రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు కొన్ని సూచనలు చేస్తానని తెలిపారు.
తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయో చెబుతానన్నారు. విభజన తర్వాత రాజకీయ అస్థిరతను తగ్గించుకునేందుకు అసెంబ్లీ స్థానాలను పెంచవచ్చునని అన్నారు. విభజన జరిగితే తీవ్రవాదం పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే అన్నారు.
తుఫాను పైన ముఖ్యమంత్రి, అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్, కరెంట్, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్నారు. తుఫానును ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
షిండే, డిగ్గీ వ్యాఖ్యలకు పొంతన లేదు: గంటా
కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్ల వ్యాఖ్యలకు పొంతన లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. మోసపూరిత ప్రకటనలను ప్రజలు నమ్మొద్దన్నారు. కాంగ్రెసు నిర్ణయంతో బిజెపి పునరాలోచనలో పడిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబోదని తాను భావిస్తున్నానని, విభజనపైన వేసిన పిటిషన్ల పైన సుప్రీం కోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఈ ప్రక్రియలో రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారన్నారు. ఈ నెల 24న జరగనున్న వన్డే మ్యాచును అడ్డుకోమని అయితే, దానిని సమైక్యాంధ్ర ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తెలిపేందుకు ఉపయోగించుకుంటామని చెప్పారు.