సిఎం రేసులో మర్రి: తెరమీదకు అసెంబ్లీ స్థానాల వాదన
తెలంగాణ వచ్చాక సిఎం రేసులో ఇప్పటికే చాలామంది ఉన్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డిలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
కాగా, తాను సిఎం రేసులో లేనని చెబుతున్న మర్రి శశిధర్ రెడ్డి తెర పైకి కొత్త వాదన తీసుకు వచ్చారు. రాష్ట్రం వచ్చాక తెలంగాణలో సుస్థిర పాలన కోసం అసెంబ్లీ స్థానాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని పార్టీ అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు మర్రి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెసు నేతల బృందం సోమవారం ఢిల్లీ వెళ్తోంది.
మర్రి నేతృత్వంలో శని, ఆదివారాల్లో నగరంలోని లేక్వ్యూ అతిథి గృహంలో పలువురు ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, ఎంపీలు నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి, ఆకుల రాజేందర్, బండారి లక్ష్మారెడ్డి, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
గతంలో హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచడం జరిగిందని మర్రి శశిధర్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. తాము అధిష్ఠానాన్ని కలిసి తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీట్ల సంఖ్యను 119నుంచి 153కు పెంచాల్సిందిగా కోరనున్నట్టు చెప్పారు.