బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్
అమరావతి: కేంద్ర బడ్జెట్పై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. నవ్యాంధ్రకు అన్యాయం జరిగిందని టీడీపీ ఎపీ మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాపోతున్నారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీతో అనుసరించాల్సిన వైఖరిపై ఆదివారం (04-02-2018) ఎంపీలతో భేటీ అనంతరం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
చదవండి: అంతా ఆరెస్సెస్, రిజైన్ చేస్తా: రాయపాటి, మౌనంవద్దు.. అతివద్దు: బాబు, 'బీజేపీ క్షమించరాని తప్పు'
చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఎంతో ఓపికగా బీజేపీతో మిత్రపక్షంగా ఉంటే కనీస అవసరాలకు కూడా బడ్జెట్ కేటాయించకుండా కష్టాల్లో నెట్టారని మంత్రి పరిటాల సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?
చదవండి: బడ్జెట్ దారుణం, అందుకే బీజేపీ ఓడింది: మోడీకి బాబు దెబ్బ, 'అమిత్ షా మాటల్లో ధైర్యం'
బీజేపీ మోసం చేస్తే జగన్ బాబును తిడుతున్నారు
రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించకుండా ప్రజలను మోసగించారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదని బీజేపీ ప్రభుత్వంపై ఒకపక్క పోరాడుతుంటే జగన్.. చంద్రబాబును విమర్శించటం సరికాదన్నారు. బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబు విసుగు చెందారు
విభజన హామీల అమలు, ఆర్థికలోటు భర్తీ విషయంలో కేంద్రం హుందాగా వ్యవహరించడం లేదని, బడ్జెట్లో రాష్ట్రానికి ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదని, కేంద్రం తీరు రాష్ట్రాన్ని తీవ్ర నిరాశపరిచిందని, చంద్రబాబు సైతం ఈ వైఖరితో విసుగుచెందారని, ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే భాగస్వాములతో చర్చించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం సకాలంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాముందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
బీజేపీ మిత్రపక్షం కాబట్టి
కేంద్రం రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గుండె రగులుతోందని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. చంద్రబాబు అనేక కష్టాలను ఎదుర్కొంటూ పాలన సాగిస్తున్నారని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించకుండా బడ్జెట్లో సరైన కేటాయింపులు చేపట్టకపోవటం మనసును కలిచి వేస్తోందని, బీజేపీ మిత్రపక్షంగా ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోతున్నామని, ఒకటి రెండు రోజుల్లో పార్టీ సమావేశం జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఓపిక నశిస్తే తిరగబడతారు
విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ప్రతి తెలుగువాడి గుండె రగిలిపోతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సీమాంధ్రకు కుడి, ఎడమల దగా జరిగిందని, రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ అయితే, వాళ్ల చేత విభజన చేయించింది బీజేపీ అన్నారు. వాళ్లు ఇచ్చిన వాగ్దానాలు వాళ్లే అమలు చేయకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఓపిక పట్టడం తెలుగువాడి నైజమని, అది నశిస్తే తిరగబడతారని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బీజేపీ విషయంలో చంద్రబాబు అప్పుడే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని, వేచి చూస్తారని కూడా అంటున్నారు. బడ్జెట్ ఆమోదం పొందే వరకు వేచి చూద్దామని ఇప్పటికే కొందరు నేతలు చెప్పిన విషయం తెలిసిందే.
టీడీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు
టీడీపీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. ఏపీలో పార్టీలో గ్రూపులపై ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఎవరూ సొంత అజెండాతో ముందుకు వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరిబాబునే మరోసారి కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఏపీలో చాలాకాలం నుంచి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హరిబాబుకు కేంద్రమంత్రి పదవి వస్తే తమకు అధ్యక్ష పదవి దక్కుతుందని కొందరు నేతలు భావించారు.
అలా చేస్తే చర్యలు
ఫిబ్రవరి ఒకటో తేదీన హరిబాబుతో పాటు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజులు అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. ఏపీలో బీజేపీ పరిస్థితి, మిత్రపక్షంతో వైరం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, పార్టీ కేడర్లో నెలకొన్న అపోహలపై వారు ఆయనకు వివరించారు. అందరి అభిప్రాయాలను విన్న తర్వాత పార్టీలో సీనియర్లు ఎందుకు ఉత్సాహంగా పనిచేయడం లేదని, పార్టీ విధానాలకు భిన్నంగా భిన్నంగా ప్రతి జిల్లాలోనూ సొంత గ్రూపులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని తెలుస్తోంది. ఎవరైనా స్వప్రయోజనాల కోసం పరితపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిత్రపక్షం టీడీపీపై ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు పారేసుకోవద్దని అమిత్ షా తనను కలిసిన పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులకు స్పష్టం చేశారు.