మాట కలిపితే అంతే: నాలుగో పెళ్లి చేసుకుని, అంతా కలిసుందామన్నాడు!
అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని, మోసం చేయడం అతనికి అలవాటైపోయింది. విలాసాలకు మరిగి ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లాడాడు. ఆ తర్వాత నాల్గో వివాహమూ చేసుకున్నాడు.
తిరుపతి: అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని, మోసం చేయడం అతనికి అలవాటైపోయింది. విలాసాలకు మరిగి ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లాడాడు. ఆ తర్వాత నాల్గో వివాహమూ చేసుకున్నాడు. అయితే, మూడో భార్యను ఇంటికి తీసుకురావడతో అతని బండారం బట్టబయలైంది. మూడో ఫిర్యాదు మేరకు పోలీసులు నిత్య పెళ్లికొడుకును కటకటాల వెనక్కినెట్టారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాకరాపేట సమీపంలోని కూరపర్తివారిపల్లెకు చెందిన బండి సిద్ధరామయ్య, వీరమ్మ కుమారుడైన నాగభూషణం తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాడు. మండలానికి చెందిన సుభాషిణితో అతనికి వివాహమైంది. అయితే కొంతకాలానికే ఆమెతో విడిపోయాడు.
ఆ తర్వాత పీలేరుకు చెందిన కల్పన అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల బాబు, ఎనిమిదేళ్ల పాప ఉన్నారు. ఈ వివాహాల గురించి తెలియనీయకుండా వెంకటగిరికి చెందిన లక్ష్మిని మూడో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా ఏడాది బాబు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి.
తాజాగా కడప జిల్లా పులివెందులకు చెందిన కృప అనే యువతిని నెమ్మదిగా ప్రేమలోకి దించి, ఆమెనూ నాల్గవ వివాహం చేసుకున్నాడు. మంగళవారం నాల్గవ భార్యతో కలిసి కొర్లగుంటలో ఉంటున్న మూడో భార్య లక్ష్మి ఇంటికి వచ్చాడు. కృపను పెళ్లి చేసుకున్నానని, అందరమూ కలిసే ఉందామని లక్ష్మికి చెప్పాడు. అందుకు లక్ష్మి ఒప్పుకోక పోవడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నాగభూషణం మూడో భార్య లక్ష్మిని చితకబాదాడు. దీంతో లక్ష్మి తిరుపతి మహిళా పోలీసులను ఆశ్రయించారు. వారు ఈస్ట్ పోలీసులకు కేసును అప్పగించారు. ఈస్ట్ ఎస్ఐ ఈశ్వరయ్య చీటింగ్ కేసు నమోదుచేసి నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
కాగా, లక్ష్మికి గతంలో పెళ్లై భర్త చనిపోయాడని, ఆ విషయం తెలియకుండా తనను మోసం చేసిందంటూ నిందితుడు మూడో భార్యపైనే ఫిర్యాదు చేశాడు. తనకు నాలుగు పెళ్లిళ్లు కాలేదని, మూడు వివాహాలే అయ్యాయంటూ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. అందరినీ బాగానే చూసుకుంటున్నానని కావాలనే తనపై లక్ష్మి ఫిర్యాదు చేస్తోందంటూ బుకాయించాడు.
ఇక నిత్య పెళ్లి కొడుకు బండి నాగభూషణం గురించిన వివరాల్లోకి వెళితే.. అతడు పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఎప్పుడూ బయటి ప్రాంతాల్లోనే తిరిగేవాడు. పదేళ్ల కిందట ఎర్రావారిపాళెం వెలుగు కార్యాలయంలో సంఘమిత్రగా విధులు నిర్వహించాడు. నిందితుడు సంఘ మిత్రగా ఉన్నప్పు డు ఓ మైనారిటీ యువతితోనూ సన్నిహితంగా మెలగడంతో ఆ యువతి బంధువులు అతడికి దేహశుద్ధి చేసి, పరిహారం ఇప్పించారు.