హత్యా.. ఆత్మహత్యా... వివాహిత అనుమానాస్పద మృతి... కొట్టి చంపేశారన్న ఆరోపణలు...
కాకినాడలో దారుణం జరిగింది. స్థానిక పల్లంరాజు నగర్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతుండగా... తమ బిడ్డను కొట్టి చంపేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. అదనపు కట్నం వేధింపులతో తమ బిడ్డను బలితీసుకున్నారని ఆరోపిస్తోంది. కుమార్తె మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం బోరున విలపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది...
తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన మండాల రమ్యశ్రీ(23), కాకినాడకు చెందిన వెంకట్లకు ఆగస్టు 19,2018న వివాహం జరిగింది. వెంకట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని... ఐదంకెల జీతం వస్తుందని చెప్పడంతో బిడ్డ జీవితం బాగుంటుందని రమ్య తల్లిదండ్రులు వెంకట్కు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పు చేసి మరీ రూ.30లక్షలు నగదు,నగలు కట్నంగా సమర్పించారు. కానీ పెళ్లి తర్వాత వెంకట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని తెలిసి షాక్ తిన్నారు. పైగా అదనపు కట్నం కోసం రమ్యను భర్త,అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.
ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు...
అదనపు కట్నం వేధింపుల గురించి రమ్య తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. ఇదే క్రమంలో గతేడాది నవంబర్లో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తల్లిదండ్రులు రమ్యను తమ ఇంటికి తీసుకెళ్లారు. 11 నెలల తర్వాత తిరిగి భర్త దగ్గరికి వెళ్లగా... అత్త,మామలు ఆమెను ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. అదనపు కట్నం తీసుకొస్తేనే ఇంట్లోకి రావాలని బెదిరించారు. దీంతో రమ్య తల్లిదండ్రులు కొంతమంది పెద్ద మనుషులను పిలిపించి వారి అత్త,మామలకు నచ్చజెప్పారు. అలా రమ్యను తిరిగి ఇంట్లో కాలు పెట్టనిచ్చారు.
ఆత్మహత్య చేసుకుందని ఫోన్...
రమ్య వచ్చాక ఆమెతో ఉండటం ఇష్టం లేని అత్త,మామలు గుంటూరులో ఉంటున్న తమ చిన్న కొడుకు వద్దకు వెళ్లిపోయారు. ఈ ఏడాది నవంబర్లో రమ్య-వెంకట్ల కుమార్తె బర్త్ డే కోసం రాజమండ్రిలోని వారి ఇంటికి వచ్చారు. ఆ మరుసటి రోజు తిరిగి గుంటూరు వెళ్లిపోయారు. అత్త,మామలు అక్కడ లేకపోయినా సూటి పోటి మాటలతో తరుచూ ఫోన్లో వేధించేవారు.భర్త నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో సోమవారం(డిసెంబర్ 14) తెల్లవారుజామున 4.30గంటలకు రమ్యశ్రీ ఆత్మహత్య చేసుకుందని వెంకట్ తన బంధువులకు చెప్పగా... వారు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
Recommended Video
కొట్టి చంపారని ఆరోపణలు...
రమ్య మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబం బోరున విలపించింది. తమ కుమార్తెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. భర్త,అత్త మామలే తమ కుమార్తె మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను బలితీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.