మాసాయిపేట రైలు ప్రమాదం: డ్రైవర్ తప్పిదమే
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ బుధవారం నివేదిక అందజేసింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు నివేదికలో తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడలేదని, రైలు వస్తున్నా మితిమీరిన విశ్వాసంతో ముందుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మృతిచెందడంతో కేసును మూసివేస్తున్నట్లు రైల్వే పోలీసులు నివేదికలో తెలిపారు.
. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, విద్యార్థులతో సహా 18 మంది మరణించారు. బస్సులో ఇస్లాంపూర్, గనేపల్లి, వెంకటాయపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సును రైలు కిలోమీటరు మేర లాక్కెళ్లింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.