అక్కడ... వైసిపి భారీ అంచనాలు... బోల్తా కొట్టినట్లేనా?... ఎందుకలాగా?
Recommended Video
పశ్చిమ గోదావరి: రాజకీయాలంటేనే ఎత్తులు...పైఎత్తులు... వ్యూహాలు...ప్రతివ్యూహాలు...అంచనాలు... ఆశాభంగాలు...ఇలా ఎన్నో రకాల మిగతా రంగాలతో పోలిస్తే ఈ రంగంలో ఇవి చాలా ఎక్కువ. అలా జరగడం ఖాయం అని...ఎంతో నమ్మకం పెట్టుకున్న సందర్భాల్లోనూ అనూహ్యమైన భంగపాటులు తప్పవు.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే...ప్రస్తుతం ఎపిలో ప్రతిపక్షపార్టీ వైసిపి కూడా ఆశాభంగం చెందిన స్థితిలో ఉందా అంటే...ఆ పార్టీ నేతలు అంగీకరించినా? అంగీకరించకపోయినా...అదే నిజమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదెలాగంటే...
అనుకున్నదొకటి...అయిందొకటి
వైసిపి అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకునే సరికి రాష్ట్రంలో చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల కారణంగా టిడిపి ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. అదే సమయంలో టిడిపి నుంచి కొందరు నేతలు వైకాపాకు వరుసకట్టడంతో ఇక అదే జోరు కొనసాగుతుందని, ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్న పశ్చిమ గోదావరిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగి పార్టీ బలం పుంజుకుంటుందని ఆశించారు. అయితే మంగళవారంతో జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ముగిసిపోయి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.
అంచనాలు...తలకిందులు
గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వైసిపికి దక్కకపోవడంతో జగన్ పాదయాత్రతో అక్కడి పరిస్థితిలో భారీ మార్పు వస్తుందని...తీసుకురావచ్చని...స్థానిక వైసిపి నేతలు భావించారు. దానికి తోడు కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర సమయంలో పార్టీలో టిడిపి నేతల చేరికలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా అదే జరుగుతుందని...జరగాలని కోరుకున్నారు. అధికారపార్టీలో ఉన్న పెద్దపెద్ద నేతలే మా పార్టీలోకి వచ్చేస్తారు చూడండి అంటూ వైసీపీ నాయకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. తీరా అవన్నీ అడియాశలు గానే మిగిలిపోయిన పరిస్థితి.
అతి కొంచెం...ఊరట...
ఇక జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో వైసిపిలో అసలెవరూ చేరలేదా అంటే...గుడ్డి కంటే మెల్ల నయం అన్న చందంగా కాస్తోకూస్తో గుర్తింపు ఉన్న ఇద్దరు నాయకులు మాత్రమే జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే చెరువకువాడ శ్రీరంగనాథరాజు కాగా మరొకరు పాక్షిక టిడిపి నేత, విద్యావేత్త గుబ్బల తమ్మయ్య. వీరు తప్ప ఇంకెవరూ జగన్ పార్టీలో చేరలేదు. అయితే వీరి చేరిక కూడా జగన్ కు ఇబ్బంది గా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. అదెలాగంటే...వైసిపిలో కొత్తగా చేరిన ఈ ఇద్దరు నేతలు ఆచంట టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే వీరిలో శ్రీరంగనాథరాజుకు ఆచంట టికెట్ ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలోకి వచ్చారని టాక్...మరైతే ముందుముందు గుబ్బల తమ్మయ్య ఏం ఆలోచిస్తారనేది వేచిచూడాల్సిందే.
ముందు ముందు కూడా...ఇలాగేనా?
జగన్ పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రజాస్పందన బాగున్నా పార్టీలో చేరికలు లేక డీలా పడిన వైసిపి నేతలను జగన్ పాదయాత్ర ముందుముందు ఇంక ఇంతేనా అనే ఆందోలన పీడిస్తోందట. జనం ఎంత బాగా వచ్చినా పార్టీలో చేరికలు కూడా అవసరమని...అది ప్రజాదరణ స్థాయిని నిర్థారిస్తుందనేది వైసిపి నేత అంతంరంగంగా కనిపిస్తోంది. ఇంత ప్రజాదరణ కనిపిస్తున్నా చేరికలు అంత వీక్ గా ఎందుకు ఉంటున్నాయో?...తేడా ఎక్కడుందో అర్థం కాక వైసిపి నేతలు అంతర్గత సమావేశాల్లో మతనపడుతున్నారట. పార్టీ వ్యూహకర్తలు మరింత గట్టిగా పనిచేసి పార్టీలో చేరికలు ముమ్మరం అయేలా చూడకపోతే ముందు ముందు మరింత నిరాశపడాల్సి వస్తుందని వైసిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.