గుంటూరు:పత్తి గౌడన్లలో భారీ అగ్నిప్రమాదం...సుమారు రూ.12 కోట్ల ఆస్తి నష్టం
గుంటూరు:గుంటూరు నగర శివార్లలోని పెదకాకానిలోని జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. పెదకాకాని వాసవీనగర్లోని పత్తి గౌడౌన్లలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
పత్తి గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అంతకంతకూ విస్తరించడంతో వేలాది పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి ఏడు ఫైరింజన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు వరుసగా పత్తి గౌడౌన్లు ఉన్న క్రమంలో మంటలు మిగతా బ్లాకులకు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు ఆరు వేల పత్తిబేళ్లు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల సుమారు రూ.12 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు వారు అంచనా వేస్తున్నారు. నాలుగు పెద్ద గోదాముల ఈ సముదాయంలో...మధ్య గౌడౌన్ లో మంటలు చెలరేగడంతో వీటిని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే నరసరావుపేట, విజయవాడ, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి ఫైరింజన్లను రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. అయితే మొదటి గోదాము, నాలుగో గోదాములో పాక్షికంగా మంటలు వ్యాపించినప్పటికీ...మధ్య గోదాము మాత్రం పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు.