విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం... 40 పూరి గుడిసెలు దగ్ధం.. బాధితులు కన్నీటిపర్యంతం..
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెంలో శుక్రవారం(మార్చి 5) మధ్యాహ్నాం ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 40 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. మరో నాలుగు స్లాబ్ ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
స్థానికుల కథనం ప్రకారం... గ్రామంలోని కుమారి అనే మహిళ ఇంటికి సమీపంలో ఉన్న పశువుల కొట్టం వద్ద తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు పక్క గుడిసెలకు వ్యాపించాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో పూరి గుడిసెల్లో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే దాదాపు 40 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి.
ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు రూ.40క్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇళ్లల్లో దాచుకున్న నగదు,ధాన్యం,ఇంటి సామాగ్రి అన్నీ కాలి బూడిదైపోవడంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. తహశీల్దార్ సీతారామరాజు దేవుపల్లి గ్రామానికి చేరుకుని అక్కడి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద కారణాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. బాధితులకు స్థానిక అధికారులు,నాయకులు తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వాపోతున్నారు.