అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు...
అనంతపురం జిల్లాలో మంగళవారం(అక్టోబర్ 20) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుందుర్పి శివారులోని మల్బరీ షెడ్లో సాయంత్రం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మల్బరీ షెడ్లో భద్రపరిచిన బిందు తుంపర సేద్యం పరికరాలు,ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ మంటలతో చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ... ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆరు రోజుల క్రితం గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ మెటీరియల్ రూమ్లోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు కి.మీ పరిధి మేర కెమికల్ దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో చివరకు అంతా ఏపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
గతంలో విశాఖపట్నంలోనూ వరుస అగ్ని ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటన మొదలు పలు పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించాయి. రాంకీ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత విశాఖ సాల్వెంట్,విజయశ్రీ ఫార్మా కంపెనీల్లోనూ అగ్నిప్రమాదాలు సంభవించాయి.