జగన్కు ప్రజలు కావాలా..? ఫ్యాక్టరీ యాజమాన్యం కావాలా..? వెంకటాపురంలో మెరుపు ఆందోళన
విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 12 మంది ప్రాణాలను బలిగొన్న ఫ్యాక్టరీని ఇక్కడినుంచి తరలించాల్సిందేనని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ పెట్టి ఊరును నాశనం చేశారని.. ఇప్పటికైనా ఫ్యాక్టరీని తరలిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీని మూసేయడమో.. లేక పోయిన ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వడమో చేయాలని ఆందోళనకు దిగారు. మృతదేహాలను సైతం దొడ్డిదారిన స్మశానాలకు తరలించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ లీకేజీ: పాలిమర్స్ కంపెనీ వద్ద మోగిన సైరన్, పోలీసులు అలర్ట్, కాపలా ఉన్న యువకుల తరలింపు
మృతదేహాలను సీక్రెట్గా తరలించే ప్రయత్నం చేశారని ఆరోపణలు
మృతదేహాలకు పోస్టుమార్టమ్ అనంతరం రహస్యంగా అంబులెన్స్లో తరలించే ప్రయత్నం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. కనీసం అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా నిర్వహించుకోనివ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ గేటు ముందు మృతదేహాలను ఉంచి ఆందోళనకు దిగారు. పలువురు యువకులు పోలీసులను తోసేసుకుంటూ గేటు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోగా.. కొంతమంది బలవంతంగా అక్కడినుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రజలు కావాలో.. ఫ్యాక్టరీ యాజమాన్యం కావాలో..
ప్రజలు కావాలో.. ఫ్యాక్టరీ యాజమాన్యం కావాలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకోవాలని వెంకటాపురం గ్రామస్తులు వాపోయారు. పోలీసులు సైతం ఫ్యాక్టరీ యాజమాన్యం వైపే నిలుస్తున్నారని.. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీని అక్కడినుంచి తరలిస్తామని ప్రకటించేదాకా ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. వెంకటాపురం సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కలిసి దీనిపై ఉద్యమిస్తామన్నారు. ఈ ఆందోళనలో పలువురు సీపీఐ నేతలు,కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. సామాన్యులు తప్పు చేస్తే అరెస్ట్ చేసే ప్రభుత్వాలు.. కార్పోరేట్ కంపెనీల నిర్లక్ష్యాన్ని మాత్రం ఎందుకు సహిస్తున్నాయని నిలదీశారు.
Recommended Video
ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారన్న పోలీస్..
తమను గ్రామం నుంచి ఖాళీ చేయించడంతో చెట్టుకొకరు.. పుట్టుకొకరు అన్నట్టుగా తయారయ్యామని వెంకటాపురం గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్లల్లో చోరీలు సైతం జరుగుతున్నాయని.. అన్ని విధాలా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులతో ప్రాణాలకు వెలకట్టలేరని.. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి,ఫ్యాక్టరీని అక్కడినుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓ పోలీస్ అధికారి మాత్రం ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అని ఆరోపించడం గమనార్హం. మొత్తంగా వెంకటాపురంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది.