పొలాల్లో నుంచి ఒక్కసారిగా!: ఎమ్మార్పీఎస్ మెరుపు ధర్నా.. కురుక్షేత్ర అణచివేతపై!
ప్రభుత్వ అణిచివేత ధోరణిని నిరసిస్తూ.. మహాసభను ఎట్టి పరిస్థితుల్లోను జరిపి తీరాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్ణయించారు.
గుంటూరు: ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో.. ఎమ్మార్పీఎస్ తలపెట్టిన కురుక్షేత్ర మహాసభకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. ప్రభుత్వ అణిచివేత ధోరణిని నిరసిస్తూ.. మహాసభను ఎట్టి పరిస్థితుల్లోను జరిపి తీరాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్ణయించారు. దీంతో పోలీసు నిర్బంధాలను చేధించుకుని మహాసభను విజయవంతం చేయడానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేలాదిగా కదులుతున్నారు.
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో.. పొలాల్లో దాక్కున్న కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి మెరుపు ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జాతీయ రహదారిపై భైఠాయించారు. ఎమ్మార్పీఎస్ సభ దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
నెల్లూరులో భారీ నిరసన:
ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర సభకు ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో.. ప్రభుత్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు మాదిగల ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
మాదిగలకు ఏం చేయాలో మాకు తెలుసు: వర్ల రామయ్య
రాష్ట్రంలో మాదిగలకు ఏం చేయాలో తమకు తెలుసునని ఏపీ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య అన్నారు. జీవో 25 అమలు చేస్తే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. వర్గీకరణ కంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని ఆనాడు వ్యాఖ్యానించిన మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు ఏపీలో ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు.