వలీ అందుకే పెళ్లి చేసుకున్నాడేమో: నీతూఅగర్వాల్
కర్నూలు: ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఇరికించేందుకే మస్తాన్ వలీ తనను పెళ్లి చేసుకున్నాడేమోనని నటి నీతూ అగర్వాల్ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం చేసిన నీతూ విలేకరులతో మాట్లాడారు.
మస్తాన్ వలీ తన భర్త కావడంతో పూర్తిగా నమ్మానని, దాంతో తాను ఆయన చేతిలో మోసపోయానని చెప్పారు. తనకు తెలియకుండానే తన ఖాతాల్లో డబ్బులు జమ చేసి స్మగ్లర్లకు మళ్లించేవాడన్నారు. సినీ పరిశ్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్కు దూరమని చెప్పారు. ఎర్ర చందనం దుంగలు ఎలా ఉంటాయో కూడా తనకు ఇప్పటికీ తెలియదని చెప్పారు.
నంద్యాలకు చెందిన ఏ1 ట్రావెల్స్ యజమాని నాగరాజు నీతు కారును అడ్డగించడం, దీనిపై ఆమె శిరువెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అతను తాను దాడికి యత్నించలేదని, వాటర్ బాటిళ్ల డబ్బుల అడిగానని వివరణ ఇచ్చారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నీతూ అగర్వాల్ చెప్పారు. దానిపై పోలీసులు కూడా స్పందించారు. తమకు నీతూ అగర్వాల్ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని, అలా ఇస్తేనే ఏమైనా చేయగలమని చెప్పారు.
నంద్యాల సబ్ జైలులో నీతూ అగర్వాల్ ఉన్న సమయంలో వివిధ అవసరాలకు ఆమెకు రూ.5వేలు నగదు సర్దుబాటు చేసినట్లు నాగరాజు చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ అయిన నాగరాజు పైన ఎర్రచనందం కూలీలను తరలించాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. నాగరాజుకు నీతూ అగర్వాల్తో ఎలా పరిచయం ఏర్పడింది, స్మగ్లర్ మస్తాన్ వలీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.