డాన్ కేవీ రషీద్ మృతి... తాడిపత్రి కేంద్రంగా మట్కా సామ్రాజ్యం... పోలీసులనే హడలెత్తించేలా...
తాడిపత్రి కేంద్రంగా మట్కా జూదాన్ని విస్తరించిన డాన్ కేవీ రషీద్ ఆదివారం(అగస్టు 9) మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను... పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి రషీద్ సన్నిహితుడు అన్న ప్రచారం ఉంది. అధికారంలో ఎవరున్నా యథేచ్చగా మట్కా కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు.
తనిఖీలకు వెళ్లిన పోలీసులపై పలుమార్లు అతని అనుచరులు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. ఒక రకంగా పోలీసులు తమ వైపు రావాలంటేనే భయపడే పరిస్థితిని రషీద్ సృష్టించాడు. 2018,డిసెంబర్ 30న తాడిపత్రిలోని మట్కా స్థావరాలపై తనిఖీలకు వెళ్లిన సీఐ హమీద్ ఖాన్పై రషీద్ అనుచరుల దాడి అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
మట్కా సామ్రాజ్యాన్ని విస్తరించిన రషీద్...
కేరళకు చెందిన తన తండ్రి నుంచి వారసత్వంగా కేవీ రషీద్ మట్కా నిర్వహణ తీసుకున్నట్లు చెబుతారు. జేసీ ప్రభాకర్రెడ్డికి సన్నిహితుడిగా ఉండటంతో ఇక రషీద్కు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ప్రచారం ఉన్నది. తాడిపత్రితో పాటు కర్నూలు, కడప జిల్లాల్లో రషీద్ తన మట్కా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రాజకీయ అండదండలు తోడవడంతో స్థానిక పోలీసులు కూడా రషీద్ని టచ్ చేసేవాళ్లు కాదన్న విమర్శలున్నాయి. అలా రషీద్ మట్కాలో కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు చెబుతారు.
పోలీసుల పైనే దాడి...
2018,డిసెంబర్ 30న తాడిపత్రిలోని మట్కా స్థావరాలపై దాడులు చేసేందుకు సీఐ హమీద్ ఖాన్ కొంతమంది పోలీసులను వెంటపెట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో రషీద్ను విచారించేందుకు అతని ఇంటి వద్దకు వెళ్లగా... అక్కడ కొంతమంది పోలీసులపై దాడులకు తెగబడ్డారు. కర్రలతో పోలీసులను చితకబాది,వారి వాహనానికి నిప్పంటించారు. ఈ దాడిలో సీఐ హమీద్తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దాడి వెనుక జేసీ ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించారు.
ముంబై టూ తాడిపత్రి..
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లో మట్కా విస్తరించడం మొదలైంది. మొదట్లో ముంబై కేంద్రంగా రతన్ లాల్ అనే వ్యక్తి మట్కా నిర్వహించేవాడు. ఆ తర్వాతి రోజుల్లో అతని పేరుతోనే అది రతన్ లాల్ మట్కాగా పాపులర్ అయింది. ముంబై నుంచి కర్ణాటకలోని బళ్లారి,ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి,కర్నూలు,కడప జిల్లాలకు విస్తరించింది. ఒక్క తాడిపత్రిలోనే ప్రతీ రోజూ రూ.1కోటి నుంచి రూ.2కోట్లు వరకూ మట్కా జూదం జరుగుతుందన్న ప్రచారం ఉంది. రూ.1 మొదలు కోట్ల రూపాయల దాకా మట్కా జూదం ఆడేందుకు అవకాశం ఉండటంతో ఎక్కువగా పేద,మధ్య తరగతి వర్గాలకే దీనికి బానిసలుగా మారి ఆర్థికంగా దివాళా తీస్తున్నారు.
మట్కా ఎలా నిర్వహిస్తారు..
ముంబైలో చీటీల ద్వారా మొదలైన ఈ మట్కా ఇప్పుడు ఆన్లైన్కి కూడా ఎక్కింది. ఈ జూదంలో మొత్తం నాలుగు ఆటలు ఉంటాయి. ఒక్కో ఆటను ఓపెన్,క్లోజ్,బ్రాకెట్లపై నిర్వహిస్తారు. మట్కా ఆడేవాళ్లు వాటిపై పందెం కాస్తారు. మట్కా బీటర్స్ రోజులో ఒక నిర్ణీత సమయంలో ఓపెన్,క్లోజ్,బ్రాకెట్ల నంబర్లు ప్రకటిస్తారు. పందెం కాసినవారి నంబర్స్ వాటితో సరిపోతే వారు జూదంలో నెగ్గినట్లు, లేదంటే ఓడినట్లు. చాలాసార్లు రూ.100 పెడితే రూ.1000 సంపాదించుకోవచ్చునన్న ఆశతో చాలామంది పేద,మధ్య తరగతి జీవులు మట్కాలోకి దిగుతారు. అయితే మట్కా నిర్వాహకులు మాత్రం పక్కా ప్లాన్తో తమకు లాభం ఉండేలా దీన్ని నిర్వహిస్తారు. దీంతో చాలామంది నష్టపోతుంటారు.