హైదరాబాద్ పోలీసులకు మత్తయ్య ఫైల్: టీ పోలీసులకు సిఐడి నోటీసులు
విజయవాడ: ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు, హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన జెరూసలెం మత్తయ్య తనకు ప్రాణరక్షణ కోరుతూ ఈ నెల 10న విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసుకు సంబంధించిన ఫైల్ను బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన సిఐడి అధికారులు స్వాధీనపరచుకున్నారు.
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నుంచి రకరకాల బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మత్తయ్య విజయవాడ సత్యన్నారాయణపురం పోలీసులకు మత్తయ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఆచూకీ నేటికీ తెలియకపోవటం ఆశ్చర్యకరమైన విషయంగానే మారింది. అతను ఎక్కడ ఉన్నదీ తమకు ఎలాంటి సమాచారం లేదని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎబి వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన సిఐడి ఎస్పీ కోటేశ్వరరావు చెబుతున్నారు.
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కోసం తెలుగుదేశం పార్టీ నేత రేవంత్రెడ్డి అడ్వాన్స్గా రూ.50లక్షలు ముట్టచెప్పినట్లుగా నమోదైన కేసులో మొదటి ముగ్గురు నిందితులు రేవంత్రెడ్డి, సెబాస్టియన్, జయసింహాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడైన మత్తయ్య కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్న సమయంలో నేరుగా ఇక్కడి పోలీసులు అతని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.
తెలంగాణ పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించాలంటూ తన కోసం సోదరుడిని చితకబాది తన భార్య, ఇతర కుటుంబ సభ్యులను నిర్బంధించారని మత్తయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు ఆధారంగా ఐపిసి 506, 507, 195 క్లాజ్ ఎ 387, 389 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఏది ఏమైనా మత్తయ్య ఆంధ్ర పోలీసుల సంరక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కోర్టులో లొంగిపోయేలా కన్పించడంలేదు. ఒకవేళ తనంతట తాను లొంగిపోతే తెలంగాణ పోలీసులు విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.
ఇదిలావుంటే, జెరూసలెం మత్తయ్య ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలోని ముఖ్యనేతలు, పోలీసు అధికారులకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయనుంది. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ టీడీపీలోని కొందరు ముఖ్యనేతలకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో ఏపీ సీఐడీ కూడా తెలంగాణ టీఆర్ఎస్ నేతలు, పోలీసులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏ క్షణమైనా వారికి ఏపీ సీఐడీ నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.