మరోసారి ఎదురుదెబ్బ: గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన మారిషస్ కోర్టు
హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ను మారిషస్ కోర్టు మరోసారి తిరస్కరించింది. ఇదివరకు రెండుసార్లు కోర్టు అతని బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. అతని బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి.
కాగా, గంగిరెడ్డి అప్పగింతకు అవసరమైన ఒప్పంద పత్రాలను భారత ప్రభుత్వం మారిషస్కు అందజేసింది. మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డిని తమకు అప్పగించాలని భారత్ మారిషస్ను కోరింది. ఈ మేరకు గంగిరెడ్డి అప్పగింతపై జూన్ 4, 10 తేదీల్లో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో గంగిరెడ్డిని భారత్కు అప్పగించే విషయంపై నిర్ణయం జరుగుతుంది.
ఒప్పంద పత్రాలతో పాటు గంగిరెడ్డి అరెస్టుకు జారీ చేసిన ఇంటర్ పోల్ నోటీసును కూడా భారత ప్రభుత్వం మారిషస్కు అందజేసింది. గంగిరెడ్డిని తీసుకుని వచ్చిన వెంటనే వివిధ కేసుల్లో విచారణకు సిఐడితో పాటు ఇతర పోలీసు విభాగాలు సమాయత్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు మారిషస్లో ఫిబ్రవరి చివరి వారంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.
కాగా, గంగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్తో పాటు విదేశాల్లో ఉన్న ఆస్తులపై కూడా ఈడీ ఆరా తీసింది. ఎర్రచందనం స్మగ్లింగ్తో గంగరెడ్డి అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. దేశవిదేశాల్లో స్మగ్లర్ గంగిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ ఈడీకి అందజేసింది. అతని ఆస్తులు జఫ్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.