మే 26 జగన్ ప్రమాణం..! జూన్ 8వరకు బాబు ఎలా సీఎంగా ఉంటారు..! వైసీపి నేత సజ్జల వ్యాఖ్యలు..!!
హైదరాబాద్ : ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో విచిత్ర విన్యాసం చేస్తున్నారని వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం మీద ఆజన్మాంతం ఆయనకు మాత్రమే హక్కు ఉన్నట్టు ప్రవర్తిసున్నారని, బిజినెస్ చేసే వాళ్ళ మీద ఐటీ సోదాలు జరగడం సాధారణమని అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే, గుంటూరు ఎంపీ అభ్యర్థి ఇంట్లో సోదాలు జరిగితే, వైసీపి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని, కేవలం చంద్రబాబు మనుషుల మీదనే జరిగినట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు స్టేలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని, దాని నుంచి బయటపడటానికే బాబు నార్త్ టూర్ అంటున్నారని అన్నారు. తన ఓటమికి ఈవీఎంలను కారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని బాబు పై రామక్రిష్ణ రెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబుకు ఉన్న మీడియా ప్రచార ద్వారా ప్రజలు ఇదంతా నిజమేనేమో అనుకునే అవకాశం ఉందని, ప్రతిపక్షంగా... ప్రజలకు వివరాలు తెలపాల్సిన బాధ్యత తమ మీద ఉందని సజ్జల రామక్రిష్ణ రెడ్డి అన్నారు. 2014లో అంతంత మాత్రం ఓట్లతో బాబు ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడకుండా ఇలా ఉద్రిక్త పరిస్థితులు స్రుష్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయిందని, ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారని ఎద్దేవా చేసారు. గెలుపు పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారని, మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.