నేడే తేలనుందా? శోభానాగిరెడ్డి వర్థంతి సభలో నంద్యాల అభ్యర్థి ప్రకటన!
నేడు శోభానాగిరెడ్డి వర్థంతి కావడంతో.. అఖిలప్రియ నంద్యాల అభ్యర్థిపై ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
కర్నూలు: ఓవైపు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రయత్నాలు.. మరోవైపు ఉపఎన్నిక సీటు తమదేనంటూ అఖిలప్రియ ప్రకటన!.. అంతిమంగా పార్టీ అధిష్టానం ఎవరిని కరుణిస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న చర్చ.
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఉపఎన్నిక సీటు తమకే వస్తుందని మంత్రి అఖిలప్రియ తొలి నుంచి ధీమా గానే ఉన్నారు. అయితే చంద్రబాబుతో శిల్పా మోహన్ రెడ్డి చర్చలు, ఎమ్మెల్యే సీటు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలతో సీటు ఎవరికి దక్కుతుందోనన్న మీమాంస నెలకొంది.
ఇదే తరుణంలో నేడు శోభానాగిరెడ్డి వర్థంతి కావడంతో.. అఖిలప్రియ దీనిపై ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తమ కుటుంబం నుంచి నంద్యాల బరిలో ఎవరు దిగుతారో ఆమె ప్రకటించనున్నారని సమాచారం. అదే వేదికపై నుంచి తమ అభ్యర్థికి మద్దతును కూడా కోరనున్నారు.
కాగా, భూమా నాగిరెడ్డి కుటుంబంలోను నంద్యాల ఉపఎన్నిక సీటు కోసం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె కాగా, మరొకరు ఆయన సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి. దీంతో అఖిలప్రియ ఎవరి పేరును ప్రకటించబోతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, నేడు జరగబోయే శోభానాగిరెడ్డి వర్థంతి సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి అఖిలప్రియ ప్రసంగించనున్నారు.