మేయర్ హత్య, చింటూ లొంగుబాటు: ప్రాణభయమా, పోలీసుల 'ఆర్థిక' వ్యూహమా?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. కారులో వచ్చిన చింటూ తనంతట తానుగా చిత్తూరు కోర్టుకు వచ్చాడు. పదమూడు రోజుల క్రితం మేయర్ దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
తాను లొంగిపోతానని చింటూ రెండు మూడు రోజుల క్రితం మీడియాకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ రోజు న్యాయస్థానంలో లొంగిపోవడం గమనార్హం. మేయర్ దంపతుల హత్య అనంతరం చింటూ పారిపోయాడు. హత్యలో పాల్గొన్న వారిలో ముగ్గురు ఆ రోజే లొంగిపోయారు.
వ్యూహాత్మకంగా లొంగిపోయాడా?
రెండు రోజుల క్రితం చింటూ.. మీడియాకు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాను లొంగిపోతానని ఆయన ప్రకటించాడు. 17వ తేదీన చింటూ తన మేనమామ, అత్తయ్య (మేయర్ అనురాధ, మోహన్)లను హత్య చేసిన అనంతరం అతను పారిపోయాడు. చింటూ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు.
పోలీసులు పది బృందాలుగా ఏర్పడి వెతికినా అతను దొరకలేదు. అయితే, అతను లొంగిపోతానని లేఖ రాయడం సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు లొంగిపోయాడు. అతను వ్యూహాత్మకంగానే లొంగిపోయాడా? అనే చర్చ సాగుతోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
దీంతో అతను ప్రాణభయంతోనే లొంగిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చింటూ లొంగిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫలించిన పోలీసుల వ్యూహం
అదే విధంగా చింటూ లొంగుబాటులో పోలీసుల వ్యూహం కూడా ఫలించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మేయర్ దంపతుల హత్య అనంతరం చింటూ పారిపోయాడు.
అతను విదేశాలకు పారిపోతాడనే అనుమానంతో పోలీసులు అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతని బ్యాంకు లావాదేవీలు సీజ్ చేశారు. కదలికల పైన కన్నేశారు. అతనికి ఎవరి నుంచి ఆర్థిక సాయం అందకుండా పోలీసులు వ్యవహరించారు. ఆర్థిక కారణాలతో పాటు ప్రాణహానీ కారణంగా అతను లొంగిపోయి ఉంటారని భావిస్తున్నారు.
కోర్టులో లొంగి పోయిన చింటూకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతనిని చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. న్యాయమూర్తి చింటూకు 14 రోజుల రిమాండ్ విధించారు.