టిడిపి నుంచి చింటూ, మహిళా కార్పోరేటర్ సస్పెండ్: మేయర్ హత్యపై పోలీసుల ఆరా
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాని, చిత్తూరు నగర పార్టీ అధ్యక్షులు మోహన్ బుధవారం ప్రకటన చేశారు.
మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడుగా ఉన్న చింటూను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చింటూకు ఎలాంటి పదవులు లేవని, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం మాత్రమే ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పుడు సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. పార్టీలో ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని వారు అభిప్రాయపడ్డారు.
చింటూ చిత్తూరులోని 70వ వార్డులో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాడు. అతడికి 09400586 నెంబరు మీద ఐడీ కార్డు కూడా జారీ అయ్యింది. మేయర్ దంపతుల హత్య తర్వాత ఆ పార్టీ జిల్లా శాఖ కార్యవర్గం షాక్కు గురైంది.
ఈ హత్యలో చింటూకు సహకరించిన ఓ మహిళా కార్పొరేటర్ భర్త మురుగన్ టీడీపీ నేతగానే ఉన్నారు. చింటూ కోర్టు ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో పార్టీ అతనిని బహిష్కరించింది. అతనితో పాటు మురుగన్, అతడి భార్య (టిడిపి కార్పోరేటర్) పార్టీ సభ్యత్వాలను కూడా రద్దు చేసింది.
గత నెల 17వ తారీఖున చిత్తూరు నగర పాలక సంస్థలో మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో చింటూ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. పోలీసులు ప్రాథమికంగా పదకొండు మంది పైన కేసులు నమోదు చేశారు.
చింటూ చెబుతున్న విషయాల ఆధారంగా నిందితుల సంఖ్య పెరగవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అందరినీ అరెస్టు చేయమని, హత్య కుట్రలో పాలుపంచుకున్నవారు, కుట్ర విషయం ముందుగానే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని వారు ఎవరున్నారో తెలుసుకొని సాక్ష్యాలు సేకరిస్తామని, ఆ తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.