అండమాన్, నేపాల్.. చింటూ ఎక్కడ?: సికె బాబు కేసులోను చెమటలు పట్టించాడు!
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు నగర మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఏ1 నిందితుడు చింటూ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చింటూ దేశ సరిహద్దు దేశాల్లో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
అతనికి సన్నిహితంగా ఉండే కొందరిని పోలీసులు విచారించగా ప్రధాన ప్రాంతాల వివరాలను తెలిపినట్లుగా తెలుస్తోంది. చింటూ కోసం 10 బృందాలను రంగంలోకి దిగాయి. అయినా ఆచూకి లభించలేదు.
గతంలో మాజీ శాసనసభ్యులు సీకే బాబుపై జరిగిన హత్యాయత్నంలో పోలీసులు చింటూను పట్టుకోవడానికి కొన్ని నెలలు శ్రమించారు. ప్రస్తుతం కూడా అతని ఆచూకీ దొరకడం లేదు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుల విచారణలో కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. చింటూ ఉండే కొన్ని ప్రధాన ప్రాంతాల వివరాలను తెలిపారని సమాచారం. అయితే ఆ ప్రాంతాల్లో చింటూ ఉండే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు కూడా బలంగా నమ్ముతున్నారు.
తండ్రి అండమాన్లో ఆర్మీలో పని చేస్తుండగా.. చింటూ కూడా అక్కడే చదువుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ స్థానికులు, పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అండమాన్కు చింటూ వెళితే తలదాచుకునేందుకు సహకరించేవారు అనేకమంది ఉన్నారని తెలుస్తోంది. ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
అలాగే నేపాల్కు పాస్పోర్టు లేకపోయినా వెళ్లేందుకు అవకాశం ఉండడంతో చింటూ ఆ దేశానికి కూడా వెళ్లే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. చింటూ శ్రీలంకకు వెళ్లినట్లు అనుమానాలు ఉన్నాయి. రామేశ్వరం నుంచి జత మార్గం ద్వారా అరగంట ప్రయాణంలో శ్రీలంకకు చేరుకునే అవకాశముంది.