మేయర్ కేసులో షాకింగ్: సికే బాబు అనుచరుడు, వైసిపి కార్పోరేటర్ ఆత్మహత్య
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆయన భర్త మోహన్ హత్య కేసులో మరో షాకింగ్. ఈ కేసులో పోలీసులు విచారించిన ఓ కార్పోరేటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విచారించిన అనంతరం నిన్న రాత్రి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
అతని ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటని పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిత్తూరు నగర 38వ డివిజన్ కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి. ఇతను నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే సికె రెడ్డి అనుచరుడు. శివప్రసాద్ రెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు అతనిని బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులకు ఇతని పైన కూడా అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో అతనిని బుధవారం విచారించారు.
బుధవారం అతనిని విచారించిన అనంతరం సాయంత్రం వదిలేశారు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్గా ఉన్నాడు. అతను మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? తెలియాల్సి ఉంది. అతను సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు.