చదివింది ఎంబీఏ .. చేసేది చైన్ స్నాచింగ్ .. జల్సాల కోసం ఇద్దరు స్నేహితుల చోరీల బాట !!
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు స్నేహితులైన చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల మూడు బంగారు పుస్తెల తాళ్ళతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నిందితులు పుల్లూరి రాజేష్, బత్తులరాజు ఇద్దరూ ఒకే కళాశాలో డిగ్రీ కలిసి చదువుకున్నారు.
డబ్బు కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన తండ్రి: చంపేస్తానని బెదిరింపు, తల్లి ఫిర్యాదుతో !
చదువుకునే రోజుల్లో స్నేహం .. ఆపై చోరీలకు రంగం
చదువుకునే రోజుల్లో వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం చోరీలు చేసే దాకా వెళ్లింది. ఎంబీఏ చదివిన ఇద్దరు స్నేహితులు జల్సాలకు అలవాటుపడి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. చోరీల ద్వారా వచ్చింది మద్యం సేవించటం, విచ్చలవిడిగా ఖర్చు చెయ్యటం చేస్తూ జల్సాగా బ్రతుకుతున్నారు. నగరాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడితే సిసిటివి కెమెరా ద్వారా దొరికి పోతామని భావించిన నిందితులు, చోరీలకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు.
పక్కా ప్లాన్ తో చోరీలకు పాల్పడుతున్న నిందితులు
చోరీలకు పాల్పడే నిందితులు వారి ప్లాన్ లో భాగంగా ద్విచక్రవాహనాలపై ఒక చోటికి చేరుకొని, ఒక ద్విచక్రవాహనంపై ఇద్దరు కలిసి బయలుదేరేవారు. ఈ క్రమంలో బండి నెంబర్ కనిపించకుండా నల్లటి ప్లాస్టర్ తో సీల్ వేసేవారు. చోరీ చేసిన తర్వాత ఇద్దరూ వారి వారి బండి తీసుకొని ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పటివరకు వీరు ఈ మధ్య కాలంలో మూడు చోరీలను చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ నెల 19వ తేదీన వేలేరు మండలం, కన్నారం గ్రామ శివారు ప్రాంతంలో ఒంటరిగా వున్న మహిళను కొట్టి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు బలవంతంగా లాక్కోని పారిపోయారు.
వాహనతనిఖీల్లో పట్టుబడిన దొంగలైన మిత్రులు
ఇదే రీతిలో నిందితులు ఈ సంవత్సరం మార్చి నెల 24వ తేదీన ధర్మసాగర్ మండలం, ఉనికిచెర్ల ఆవుటర్ రింగ్ ప్రాంతంలో , సిద్ధపేట జిల్లా, అక్కన్నపేట మండలం, రేగొండ గ్రామ శివారు ప్రాంతంలో ఒంటరిగా వున్న మహిళను కొట్టి బంగారు పుస్తెలతాడు బలవంతంగా లాక్కోని ద్విచక్ర వాహనంపై పారిపోయారు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా అనుమానించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
చదువుకున్న వాళ్ళే చోరులుగా .. చెడు వ్యసనాలే కారణం
వారి వద్ద మూడు పుస్తెల తాళ్ళు లభించడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం వెల్లడించారు సదరు చోర శిఖామణులు. నిందితుల్లో ఒకరైన పుల్లూరి రాజేష్ పాన్షాపు నిర్వహిస్తుండగా, మరోనిందితుడు బత్తుల రాజు మెడికల్ రిప్రజెంటేటివ్ పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.చదువుకుని మంచి మార్గంలో జీవించాల్సిన చాలా మంది యువత చెడు వ్యవసనాలకు బానిసలుగా మారి చోరీలకు పాల్పడుతున్నారు. చదువుకున్న వారే దొంగలుగా మారటం సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.