జగన్కు ఊరట: రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా మేడా పోటీ, తప్పుకున్న అమర్నాథ్ రెడ్డి
కడప: జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో మేడా మల్లికార్జున రెడ్డి, అమర్నాథ్ రెడ్డిల మధ్య ఒప్పందం కుదిరింది. రాజంపేటలోని ఆకేపాటి భవన్లో మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డిలతో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి ఇరువురికి మిథున్ రెడ్డి సహా నేతలు సర్ది చెప్పారు.
వాళ్లు వెళ్లిపోవడమే మంచిది: ఆమంచి-అవంతిలపై బాబు, మరికొందరు కూడా పార్టీ మారవచ్చు!
మల్లికార్జున రెడ్డి, అమర్నాథ్ రెడ్డిల అంగీకారం
మేడా మల్లికార్జున రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయన వైసీపీలో చేరారు. రాజంపేట ఎమ్మెల్యే టిక్కెట్ హామీతోనే జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అమర్నాథ్ రెడ్డి కూడా ఈ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఇరువురితో నేతలు చర్చించారు. శుక్రవారం ఇద్దరు ఓ అంగీకారానికి వచ్చారు. కడప జిల్లాలో ఇది వైసీపీకి, జగన్కు పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
అందుకే తప్పుకున్న అమర్నాథ్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన మేడానే వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అమర్నాథ్ రెడ్డి తప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ రెడ్డికి మంచి అవకాశాలను ఇస్తామని అధినాయకత్వం తెలిపింది. దీంతో అమర్నాథ్ రెడ్డి కూడా ఓకే చెప్పారు. అనంతరం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ... రాజన్న ఆశయాల కోసం జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. తమ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని చెప్పారు.
అమర్నాథ్ రెడ్డి సహకారంతో మేడాను గెలిపిస్తాం
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేస్తామని మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. అమర్నాథ్ రెడ్డి సహకారంతో మేడాను అధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు.
పార్టీ మారిన వారిపై లోకేష్ నిప్పులు
టిక్కెట్ రాదని తెలిసినవారే పార్టీలు మారుతున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పార్టీలో, సీఎంతో విభేధాలు ఉంటే ముందే వెళ్లాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లలో గెలిచి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఇన్నాళ్లు పార్టీతో ప్రయాణం చేసి ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మొన్నటి దాకా జగన్ను తిట్టి ఇప్పుడు జగన్ పక్కన కూర్చుంటున్నారని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి అండగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలోని సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.