చంద్రబాబు దోపిడీ: టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, జగన్ను సీఎం చేస్తామని ప్రకటన
కడప/హైదరాబాద్: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత మేడా మల్లికార్జున రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పదవులకు రాజీనామా చేసి వచ్చి, 31న అధికారికంగా చేరమని జగన్ చెప్పారని అన్నారు.
జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! అర్హత లేదు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు
చంద్రబాబు తీరుతో నేతలు బాబూ.. నిన్ను నమ్మలేం అంటూ పార్టీని వీడుతున్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి, కాపు రిజర్వేషన్లు.. ఇలా అనేక హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే జగన్ పాదయాత్ర చేశారన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి అన్నారు. చంద్రబాబును ఓడించి జగన్ను సీఎం చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ తులసివనం
చంద్రబాబు గంజాయివనం నుంచి జగన్ తులసివనంలోకి రావడం ఆనందంగా ఉందని మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. ఇన్నాళ్లకు గంజాయి వనం వంటి టీడీపీ నుంచి తులసివనం వంటి వైసీపీలోకి వచ్చినట్లుగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనేది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది తన కోరిక అని చెప్పారు. తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
నాలుగున్నరేళ్లు టీడీపీలో ఇబ్బంది పడ్డా
తనకు తెలుగుదేశం పార్టీలో ఉండటం ఇబ్బందికరంగా అనిపించిందని మేడా చెప్పారు. నాలుగున్నరేళ్లు టీడీపీలో ఇబ్బంది పడ్డానని చెప్పారు. జగన్ చిన్నవాడు అయినప్పటికీ, మాటమీద నిలబడతారన్నారు. చంద్రబాబు మాటలు నమ్మలేకపోతున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును దోపిడీదారు ఆరోపించారు. చంద్రబాబు వంటి దోపిడీదారు వద్ద ఉండలేక తాను వచ్చానని చెప్పారు.
దోపిడీని చూడలేకే టీడీపీని వీడా
నిన్ను నమ్మను బాబూ.. అని ప్రజలు అంటున్నారని, అలాంటి వ్యక్తి వద్ద ఉండలేనని మేడా అన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు. ఆయన పనికి రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీని చూడలేకే టీడీపీని వీడానని సంచలన ఆరోపణలు చేశారు. రూ.800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనుగోలు చేశారని ఆరోపించారు.
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తా
తాను వైసీపీలో చేరుతానని చెప్పగా, అన్నా... మీరు పదవులకు రాజీనామా చేసి, వచ్చి ఈ నెల 31వ తేదీన వైసీపీలో చేరాలని తనకు జగన్ చెప్పారని మేడా మల్లికార్జున రావు అన్నారు. తాము జగన్ను గెలిపించుకుంటామని చెప్పారు. తాను ఈ రోజే టీడీపీకి, పార్టీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రేపు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని చెప్పారు.
జగన్ నచ్చారు, ముఖ్యమంత్రిని చేస్తాం
జగన్ విధానాలు తనకు నచ్చాయని మేడా మల్లికార్జున రావు అన్నారు. చంద్రబాబును ఓడించి, జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు పని చేస్తామని చెప్పారు. జగన్ సమక్షంలో తాను ఈ రోజుపార్టీ తీర్థం పుచ్చుకున్నానని, 31న అధికారికంగా చేరుతానని అభిప్రాయపడ్డారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేశామని చెప్పారు.
ఆదినారాయణ రెడ్డలా అడ్డదారులు తొక్కం
మేం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నామని, ఆయన ఏం చెబితే అది చేస్తామని మేడా అన్నారు. ఆదినారాయణ రెడ్డి అడ్డదారిలో టీడీపీలోకి వచ్చి పదవులు పొందారని, తాము అలా అడ్డదారులు తొక్కమని చెప్పారు. వైయస్ ఆశయాలకు అనుగుణంగా, జగన్ బిక్షం పెడితే గెలిచిన వ్యక్తి అన్నారు. అలాంటి ఆదినారాయణ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలో చేరారని చెప్పారు.