లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుండగా.. అమరావతిలో మీడియా నిర్వాకం.. కిటికీలో కెమెరాలు పెట్టి..
స్కూల్ గదిలో ఓ లేడీ కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించిన వ్యవహారం కలకలం రేపుతున్నది. ఏపీ అసెంబ్లీ సమావేశాల డ్యూటీ కోసం అమరావతికి వచ్చిన ఆ లేడీ కానిస్టేబుల్ తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడంతో ఓ ప్రముఖ చానెల్ కు చెందిన ముగ్గురు కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వైరలైన ఈ సంఘటనపై లేడీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది.
అసలేం జరిగిందంటే..
రాజధాని రైతుల నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు పెద్ద ఎత్తున పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. రాష్ట్రం నలుమూలల్లోని వివిధ స్టేషన్ల నుంచి మహిళా పోలీసులు కూడా డ్యూటీకి వచ్చారు. వాళ్లు భోజనాలు చేయడానికి, దుస్తులు మార్చుకోవడం వగైరా అవసరాల కోసం అధికారులు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ బంగళాలు, స్కూళ్లలో ఏర్పాట్లు చేశారు. మందడం గ్రామంలో జెడ్పీ హైస్కూల్ లో కొన్ని గదుల్ని లేడీ కానిస్టేబుళ్లకు కేటాయించారు. అక్కడే ఈ సంఘటన జరిగింది.
కిటికీవైపు చూసి కేకలు వేయడంతో..
ఖాళీ గదిలో తాను దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కిటికీ వైపు చూసి షాక్కు గురయ్యానని, రెండు కెమెరాలతో లోపలి దృశ్యాలను చిత్రీకరించడం గమనించానని బాధిత లేడీ కానిస్టేబుల్ తెలిపారు. గట్టిగా కేకలు వేయడంతో బయటున్న మరో మహిళా పోలీసులు కంగారుపడుతూ లోపలికొచ్చిందని, జరిగింది చెప్పగానే తను కాంపౌండ్ లోని ఇతర సిబ్బందిని అలెర్ట్ చేసిందని వివరించారు. వీడియో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తులు మీడియా ప్రతినిధులని తర్వాత తెలిసి విస్తుపోయానని ఆమె చెప్పారు.
ముగ్గురిపై కేసు?
బాధిత లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ముగ్గురు కెమెరామెన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుమానితుల పేర్లు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు.. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారా? లేదా? అనే వివరాలు వెల్లడించలేదు. ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు మంగళవారంతో ముగియడంతో బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. మందడం జెడ్పీ స్కూల్లో మొత్తం 23 గదులు, 12సెక్షన్లు ఉన్నాయని, ఖాళీ గదుల్నే పోలీసులకు కేటాయించామని హెడ్ మాస్టర్ కోటేశ్వర్ రావు తెలిపారు. జరిగిన సంఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్రేమ్ కాజల్ తీవ్ర స్పందన
అసెంబ్లీ డ్యూటీకి వచ్చిన మహిళా కానిస్టేబుల్ కు మందడం స్కూల్లో ఎదుర్కొన్న అనుభవంపై లేడీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. మీడియా ప్రతినిధులై ఉండి ఓ మహిళా పోలీస్ దుస్తులు మార్చుకుంటుంటే వీడియో తీయడం దారుణమని, అనుమానితులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అసోసియేషన్ ప్రతినిధులైన విశాఖ డీఎస్పీ ప్రేమ్ కాజల్, తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐడీ ఏఎస్పీ సరిత డిమాండ్ చేశారు.