గ్యాస్ లీక్ గ్రామాల్లో నెల రోజుల పాటు మెడికల్ క్యాంపు .. నార్మల్ అయ్యేదాకా బాధ్యత ప్రభుత్వానిదే !!
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు . మంత్రులు ఆ గ్రామాలలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహిస్తుంది . ఇక నిన్న గ్యాస్ లీకేజీ జరిగిన , గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో బస చేసిన మంత్రులు, ఎంపీ విజయసాయి రెడ్డి రాత్ర అంతా అక్కడే ఉండి ప్రజల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రాత్రంతా బాధిత గ్రామాల ప్రజలతో కలిసి తిని అక్కడే నిద్రించిన ఎంపీ, మంత్రులు నేడు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పారు.
ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ఈ రాత్రికి బస చెయ్యనున్న మంత్రులు..ఎందుకంటే
ఎంపీ విజయసాయితో పాటు మంత్రులు నేడు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన
గ్యాస్ లీక్ బాధిత గ్రామాలలో పరిస్థితి సాధారణం అయ్యే వరకు అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఇక నెల రోజుల పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిన్న రాత్రి గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో నిద్రించిన ఎంపీ విజయసాయితో పాటు మంత్రులు నేడు గ్రామాలలో పర్యటిస్తున్నారు. గ్రామస్థులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని , ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పిన ఆయన ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని పేర్కొన్నారు.
గ్యాస్ లీక్ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా మార్చటానికి ప్రభుత్వ యత్నం
ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని వాలంటీర్ల ద్వారా బాధితులందిరికీ ఇస్తామని, ఎవరికీ ఇందులో అన్యాయం జరగదని చెప్పారు. ఇక ఈ పరిహారం కోసం ఎవరి వద్దకు వెళ్లొద్దు అని, మీ ఇంటికే వచ్చి పరిహారం ఇస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. గ్యాస్ లీకేజ్ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా మార్చటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇక అప్పటి వరకు గ్రామాల ప్రజల సంరక్షణా బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు . అలాగే ప్రజలకు మధ్యాహ్నం, సాయంత్రం భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.
సాధారణ స్థితి వచ్చే వరకు అంతా బాధ్యత ప్రభుత్వానిదే
ఇక గ్యాస్ ప్రభావిత ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంతవరకు బాధ్యత అంతా ప్రభుత్వానిదే అని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో అంతా శానిటైజ్ చేసి అధికారులు, ప్రభుత్వం కృషితో ఇప్పటికే సాధారణ పరిస్థితులు తీసుకురావటానికి తగు చర్యలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాలలో స్థానిక పరిస్థితులపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని , అందుకే ప్రజల ప్రాణ రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారని చెప్పారు.
Recommended Video
గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో నెల రోజుల పాటు సేవలు అందించనున్న వైద్య బృందాలు
నెల రోజుల పాటు వైద్యులు క్యాంపుల ద్వారా గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారని పేర్కొన్నారు. కళ్ళు , ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించి వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు . ప్రత్యేక డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి గ్రామాల్లో ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా తగిన సూచనలు చేశారు.