అసభ్యంగా తాకుతూ మెడికోకు లైంగిక వేధింపులు: ప్రొఫెసర్ను చితకబాదిన బంధువులు
నెల్లూరు: మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల ఘటన స్థానికంగా మరోసారి కలకలం సృష్టించింది. మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థిని పట్ల అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన విద్యార్థిని కుటుంబసభ్యులు దాడికి దిగారు. మెడికల్ కాలేజీలో హెచ్ఓడీల సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లోకి వెళ్లిన బాధిత విద్యార్థిని బంధువులు ప్రొఫెసర్ చంద్రశేఖర్పై దాడి చేశాడు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సర్జరీ డెమోకు వెళ్లిని విద్యార్థినిని అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ్నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని.. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది.
ఈ క్రమంలో విద్యార్థిని బంధువులు మెడికల్ కాలేజీకి వెళ్లి ప్రొఫెసర్ను చితకబాదాడు. ఈ దాడిలో ప్రొఫెసర్కు తీవ్రగాయాలయ్యాయి. లైంగిక వేధింపులు, ప్రొఫెసర్ పై దాడి కాలేజీలో కలకలం రేపింది.
విద్యార్థిని పట్ల ఇలా ప్రవర్తిస్తే ఇక పేషెంట్ల పట్ల సదరు ప్రొఫెసర్ ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని బాధిత విద్యార్థిని వాపోయింది. సర్జన్ డెమోకు వెళ్లిన తనను అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలిపింది.
కాగా, సూపరింటెండెంట్ రాజు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, ప్రొఫెసర్పై దాడి చేసి గాయపర్చడం సరికాదని అన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ నిర్మలా దేవి మాట్లాడుతూ.. విద్యార్థిని సదరు ప్రొఫెసర్పై ఫిర్యాదు చేసిందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.