ఫ్రెండ్స్ డే విషాదం: ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
నెల్లూరు: నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న బి నాగశ్రావణి (20) అనే విద్యార్థిని శనివారం రాత్రి తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.
విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. నాగశ్రావణి చదువులో ముందుండేదని, ఈ మధ్య కాలంలో నిర్వహించిన కొన్ని పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో కాలేజి యాజమాన్యం శ్రావణిని తోటి విద్యార్థుల ముందు అవమానకరంగా మాట్లాడారని చెప్పారు.
దాన్ని మనసులో పెట్టుకొని ఎవరుతో పలకకుండా మౌనంగా ఉండేది. రంజాన్ పండుగ సెలవులకు తన సొంత ఊరు అయిన కర్నూలుకు వెళ్లి వచ్చిందని, అయినా ఆమెలో మార్పు కనిపించలేదని తోటి విద్యార్థులు తెలిపారు. శనివారం రాత్రి తనతోపాటు గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పనిమీద బయటకు వెళ్లగా శ్రావణి తన చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందింది.
శ్రావణి ముఖంపైన ఇబ్బందికరమైన మచ్చలుండటంతో సర్జరీ చేయించుకొందని, సర్జరీ అనంతరం కూడా ముఖం అందంగా కాకపోవడంతో తోటి విద్యార్థులకు తన ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకొని మరణించిందని కాలేజీ యాజమాన్యం కట్టుకథలు అల్లుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నట్లు ఎస్సై గిరి తెలిపారు.