దత్తత గ్రామంలో వైద్య ఆరోగ్య సర్వే: మహేష్ బాబు థ్యాంక్స్(ఫొటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య సర్వే నిర్వహించారు. మహేష్ తన సోషల్మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
వైద్య విద్యార్థులు గ్రామస్థులను కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో శ్రమించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.
ఆరోగ్యం పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో 150 మంది వైద్య విద్యార్థుల బృందం పాల్గొన్నట్లు మహేష్ తెలిపారు.
కాగా, మే నెలలో మహేష్ బాబు బుర్రిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బుర్రిపాలెం గ్రామానికి మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు. ఆయన తన బావ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఇతరులతో కలిసి తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించారు.
తనకు బుర్రిపాలెం గ్రామం రావడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన తండ్రి, తాత, బాబాయ్ ఊరికి చేశారని, నేను వారి దారిలో నడుస్తున్నానని చెప్పారు. మా ఊరిని దత్తత తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. నేను శ్రీమంతుడు సినిమా చేస్తున్న సమయంలో తన బావ గల్లా జయదేవ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పారన్నారు.
తాను చేసిన శ్రీమంతుడు సినిమా కూడా ఓ ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వచ్చిందేనని చెప్పారు. తన బావ దత్తత తీసుకుంటే బాగుంటుందని చెప్పారన్నారు. తాను గ్రామంలో విద్య, వైద్య పైన ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు. ఇకపై ఈ గ్రామానికి మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు.
ఆంధ్రా ఆసుపత్రి ద్వారా ప్రతి ఇంటికి ఆరోగ్య కార్డు పంపిణీ చేశామని చెప్పారు. సిద్ధార్థ కాలేజీ ద్వారా యంగ్ ఇండియా గ్రూప్ చాలా సహకరిస్తోందన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు... రంగుల రోడ్లు వేస్తే బాగుండదు కదా అని సరదాగా సమాధానం చెప్పారు. తాను రోడ్లకు రంగులు వేయించి వెళ్లిపోనని, విద్య, వైద్యంపై దృష్టి సారిస్తానని చెప్పారు.