రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్...ఈ-ఫార్మసీ విధానంపై నిరసన;అత్యవసరమైతే...!
విజయవాడ:ఆన్లైన్లో మందుల విక్రయాలకు సంబంధించిన ఈ-ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 28 న మెడికల్ షాపుల యజమానులు దేశ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ విధమైన వ్యాపారానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ (1940)లో మార్పులు చేయడంపై మెడికల్ షాపుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈనెల 20 నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న మెడికల్ షాపుల యజమానులు తాజాగా ఇలా భారత్ బంద్ కు దిగారు.
భారత దేశం మొత్తం మీద ఔషధాల విక్రయాల వ్యాపారంలో ఉన్న సుమారు 8లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్ట్ లు వారిపై ప్రత్యక్షంగా,పరోక్షంగా ఆధారపడిన 80 లక్షల మంది ఉద్యోగుల జీవనోపాధిపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభావం చూపుతుందని ఈ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ-ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటించాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు ఇచ్చింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ దుకాణాల బంద్ పై అవగాహన విషయమై సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్, కృష్ణాజిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు, వాల్పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో ఎక్కడా ఒక్క మెడికల్ షాపు తెరవడానికి అనుమతి లేదని వీరు స్పష్టం చేస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసరంగా మందులు అవసరమైతే తమకు ఫోన్లో సమాచారం ఇచ్చినా వారికి మందులు సరఫరా చేయడం జరుగుతుందని కృష్ణాజిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.ఎస్.పట్నాయక్ చెప్పారు. వెబ్సైట్ల నుంచి తీసుకున్న మందులు వికటించి రోగి మరణిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కృష్ణాజిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.