రికార్డ్: బోయింగ్ 777 కమాండర్గా తెలుగమ్మాయి, తెరవెనుక పోరాటం
మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ చెప్పినట్లుగా కలల కనండి.. సాకారం చేసుకోండి అన్న మాటను ఆమె నిజం చేసింది. ఎందుకంటే.. ఆమె చిన్నప్పుడే తన భవిష్యత్పై ఊహించుకున్న కలలను సాకారం చేసుకుంది.
హైదరాబాద్/అమరావతి: మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ చెప్పినట్లుగా కలల కనండి.. సాకారం చేసుకోండి అన్న మాటను ఆమె నిజం చేసింది. ఎందుకంటే.. ఆమె చిన్నప్పుడే తన భవిష్యత్పై ఊహించుకున్న కలలను సాకారం చేసుకుంది. ఏకంగా బోయింగ్ 777 విమానానికి తొలి యువ మహిళా కమాండర్గా చరిత్ర సృష్టించారు. ఆమే విజయవాడకు చెందిన అన్నీ దివ్య.
ఎన్ని అడ్డంకులు, అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఆమె విశ్రమించలేదు. ఇలా ఆమె కన్న కలలను ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. ఆమె జీవితం నేటి యువతకు స్ఫూర్తి అనడంలో ఏమాత్రం సంకోచం లేదు.
తల్లి బలమైన కోరిక
దివ్య తండ్రి సైన్యంలో జవానుగా విధులు నిర్వహించేవారు. మొదట ఓ పాప. భార్య రెండోసారి గర్భం దాల్చినప్పుడే ఆయనకి పంజాబ్లోని పఠాన్కోట్ సైనిక స్థావరానికి బదిలీ అయింది. ఆ స్థావరానికి దగ్గరే.. ఎయిర్ బేస్ ఉంది. యుద్ధ విమానాలన్నీ అక్కడ దిగుతూ, వెళుతూ ఉండేవి,. దీంతో గర్భిణిగా ఉన్న దివ్య వాళ్లమ్మకి రోజూ వాటిని చూడటం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డని పైలట్ చేయాలని అనుకుంది. అయితే, ఆమె.. తనకు అబ్బాయి పుడతాడేమోనని కుందేమో. కానీ, మళ్లీ అమ్మాయే(దివ్య) పుట్టింది. దివ్య పుట్టాక ఆమె తండ్రి 19ఏళ్ల సర్వీస్కి రాజీనామా చేసి పూర్వీకుల స్వస్థలం విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మాజీ సైనికాధికారిగా పిల్లల చదువులకి ఇబ్బంది లేకున్నా.. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పలేదు. పైగా, దివ్య తర్వాత మరో అబ్బాయి పుట్టాడు. అలా ముగ్గురు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. అయితే, దివ్యను పైలట్ చేయాలన్న తన కోరికను మాత్రం వాళ్ల వదులుకోలేదు. అమ్మాయైనా సరే.. దివ్యను పైలట్ చేసి తీరాల్సిందేనని పట్టుదలతో దివ్యను చిన్నప్పటి నుంచే అందుకు సిద్ధం చేసింది.
ఆటంకాలు ఎదురైనా..
దివ్య తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో ‘మీ జీవిత లక్ష్యాలు రాయండి' అని చెప్పిందట టీచర్. దీంతో దివ్య.. లాయర్, డాన్సర్, సంస్కృతం, సంగీతం.. వీటిన్నింటిపైన పైలట్ అని రాసిందట. దీంతో క్లాసులోని విద్యార్థులంతా పగలబడి నవ్వారు. ‘ఎవరికైనా ఒకట్రెండు లక్ష్యాలుంటాయి కానీ.. నీకు ఇన్నేంటీ?' అని ప్రశ్నించారట. అయితే, దివ్య మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇంటికొచ్చి అమ్మతో విషయం చెప్పింది. ఆమె ‘నువ్వు పదో తరగతిలో 90 శాతం మార్కులు తెచ్చుకుంటే ఏదైనా సాధించవచ్చు!' అని దివ్యతో చెప్పింది. దీంతో పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్లోనూ తల్లి చెప్పిన విధంగా మార్కులు సాధించింది. పైలట్ అవడానికి మార్గం ఎవరూ చెప్పకపోవడంతో దివ్య కూడా ఎంసెట్ రాసింది. మంచి మార్కులతోనే ఇంజినీరింగ్ సీటొచ్చింది. అక్కడ కూడా తాను పైలట్ అవ్వాలన్న కోరికను మాత్రం వదల్లేదు దివ్య. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని ‘ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ(ఇగ్రువా)' గురించి దివ్యకు తెలిసింది. వెంటనే అక్కడికెళ్లి చేరతానంది. తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. దీనికి వాళ్ల ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం. దివ్య తన ఖర్చుల కోసం పదకొండో తరగతి నుంచే పిల్లలకి ట్యూషన్లు చెబుతుండేది. తండ్రి అంగీకరించకపోయినా.. దివ్యకి అమ్మా, అక్కయ్యా తోడు నిలవడంతో ఆయన కూడా దివ్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు.
అండగా నిలిచిన అమ్మ..
ఈ నేపథ్యంలో తన తల్లితో కలిసి దివ్య ఇగ్రువా చేరుకున్నారు. ఫీజు రూ. 15లక్షలని చెప్పారు అకాడమీ వారు. దీంతో ఇతర వివరాలూ కనుక్కొని ఇంటికొచ్చారు. విషయం చెప్పడంతో అంత భారీ మొత్తం మనకు ఎలా సాధ్యమవుతుందని తండ్రి ప్రశ్నించారు. ఇరుగు పొరుగు వారు కూడా అదే మాటన్నారు. అంతేగాక, ఆడపిల్ల పైలట్ కావడమేమిటంటూ నిరాశపర్చే మాటలను వదిలారు. కానీ, దివ్యలో కలని నాటిన వాళ్లమ్మ కూతురికి వెన్నుదన్నుగా నిలిచింది. ముందు అమ్మాయిని పోటీ పరీక్షలు రాయనివ్వండి. ఎంపికైతే ఆ తర్వాత చూద్దాం.. అని దివ్య తండ్రికి చెప్పింది. కాగా, ఇగ్రువాలో ఏడాదికి 30 సీట్లే కాబట్టి.. పోటీ తీవ్రంగా ఉండేది. అయితే, పట్టుదలతో అభ్యసించిన దివ్య ప్రవేశపరీక్షలో ప్రథమ శ్రేణిలో ఎంపికైంది. దీంతో తండ్రి కూడా దివ్యకు అడ్డు చెప్పలేకపోయారు.
అవమానాలకు బెదరలేదు..
2006లో ఇగ్రువా క్యాంపస్లో చేరింది దివ్య. ఈ అకాడమీలో చేరేది ఎక్కువగా డబ్బున్నవాళ్లే ఉన్నారు. అప్పటికి దివ్యకి ఇంగ్లీష్ సరిగా రాకపోయేది. ఎంతో కొంత వచ్చింది మాట్లాడినా.. దానిలోని లోపాలను వెతికి మొదటిరోజు నుంచే ఆమెని వెక్కిరించడం మొదలుపెట్టారు సహా అభ్యసకులు. అయితే, తన లక్ష్యం కోసం అన్ని అవమానాలూ సహించింది దివ్య. అహర్నిశలు శ్రమించి తన ఆంగ్ల ఉచ్ఛరణని మార్చుకుంది. తాను రైల్లో తొలిసారి ఢిల్లీకి వచ్చానని చెబితే నవ్వారట. విమానంలో వచ్చేందుకు కూడా డబ్బులు లేవా? ప్రశ్నించారట. అయినా అవేమీ పట్టించుకోలేదు దివ్య. అయితే, వాళ్లెవరికీ రాని ఓ అవకాశం దివ్యకి వచ్చింది. అదేమంటే.. తొలిసారి విమానాన్ని.. ఆమె ప్రయాణికురాలిగా గాక ఓ పైలట్గానే ఎక్కడం విశేషం. ఆమె 19ఏళ్లకే విమానాన్ని నడపడం గమనార్హం.
కెప్టెన్గా రికార్డు
పట్టుదలగా అభ్యసించిన దివ్య.. కోర్సు చివరి ఏడాది మొదటిర్యాంకు సాధించింది. స్కాలర్ షిప్ కూడా అందుకుంది. కోర్సు ముగించగానే స్పెయిన్, లండన్లో బోయింగ్ విమానాల కెప్టెన్గా శిక్షణ తీసుకుంది. అలా ప్రపంచంలోనే అతిపొడవైన బోయింగ్ 777 రకం విమానాలని నడపడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద జంట ఇంజిన్లున్న విమానాలు ఇవి! తాజాగా ఆ విమానాలకు ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన మహిళా కెప్టెన్గా రికార్డు సృష్టించింది.
ఒక్కొక్కటిగా.. బాధ్యత మరవలేదు..
దివ్య తన తొమ్మిదో తరగతిలో రాసిన లక్ష్యాల జాబితాలో ఒక్కొక్కిటిగా సాధించుకుంటూ పయనిస్తోంది. ఆమె జీవితంలో ప్రధాన లక్ష్యం పైలట్ కావడం. అది ఎంతో శ్రమించి సాధించేసింది. ఆ తర్వాత ‘లా' కూడా పూర్తి చేసింది. అంతేగాక, అన్నిరకాల నాట్యాలూ నేర్చేసుకుంది. ఇక విజయవాడ వచ్చినప్పుడల్లా సంస్కృతం నేర్చుకుంటూ చివరి లక్ష్యాన్ని కూడా సాధించే పనిలో ఉంది దివ్య. అంతేగాక, ఎప్పుడూ తనకు అండగా నిలిచిన తన కుటుంబం పట్ల కూడా దివ్య తన భాద్యతను మర్చిపోలేదు. అక్కని అమెరికాలో, తమ్ముడిని ఆస్ట్రేలియాలో చదివిస్తోంది. అమ్మానాన్నలకి విజయవాడలో ఇల్లు కట్టించింది. ఇక దివ్య తాను హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుంది. ‘మీకు మీ తల్లిదండ్రులు అతి పెద్ద మద్దతుదారులు. వారిపై విశ్వాసం ఉంచండి. మీ శ్రమను నమ్ముకోండి. తప్పక విజయం సాధిస్తారు' అని యువతకు తన సందేశాన్నిచ్చారు ఈ 30ఏళ్ల యంగ్ కెప్టెన్ దివ్య.