చిరంజీవితో "నీ మీద నాకు ఇదయ్యో" అంటూ ఉర్రూతలూగించిన జయమాల... ఇప్పుడు కర్ణాటక మంత్రి
బెంగళూరు:ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రి వర్గం కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ కేబినెట్ కూర్పు సందర్భంగా తలెత్తిన వివాదాల గురించి కాసేపు పక్కన పెడితే ఈ మంత్రి వర్గంలోని ఒక వ్యక్తి ఇప్పుడు మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నారు.
ఆ వ్యక్తి మరెవరో కాదు...ప్రముఖ కన్నడ నటి జయమాల. ఈమెకు కర్ణాటక తాజా మంత్రి వర్గంలో రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతికశాఖ బాధ్యతలను అప్పగించారు. ఈమె కర్ణాటక తాజా మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన ఏకైక మహిళ కావడం విశేషం. అంతేకాదు ఈమెకు తెలుగు సినిమా రంగంతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలసి రాక్షసుడు అనే సూపర్ హిట్ చిత్రంలో కలసి నటించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో చిరంజీవి...జయమాల మధ్య చిత్రీకరించిన "నీ మీద నాకు ఇదయ్యో" అనే పాట కుర్రకారుని ఉర్రూతలూగించింది.
జయమాల...అప్పటి ఫేమస్ హీరోయిన్
జయమాల కన్నడంలో ఒకనాటి ఫేమస్ హీరోయిన్. అంతేకాదు కన్నడంతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా ఈమె కథానాయికగా రాణించింది.ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత మంచి నటిగా పేరు తెచ్చుకొన్న ఈమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్ గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ హీరోల సరసన నటించింది.
చిరంజీవితో..."నీమీద నాకు ఇదయ్యో"
తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ కాగా...ప్రత్యేకించి ఆ చిత్రంలో ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలసి నర్తించిన "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాట సూపర్ హిట్ గా నిలిచి చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఈమె మీద పడేలా చేసింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు కాగా దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. సంగీతం ఇళయరాజా అయితే గాయనీగాయకులు బాలు,జానకి.
జయమాల...చాలా స్పెషల్
కథానాయిక గానే కాదు జయమాల నిర్మాతగా మారి కొన్ని మంచి సినిమాలను సైతం నిర్మించింది. ఈమె నిర్మించిన తాయి సాహిబా అనే కన్నడ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారం- స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈమె నిర్మించిన మరొక కన్నడ చిత్రం తుత్తూరి అనే బాలల చిత్రానికి కూడా జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. అంతేకాదు కర్ణాటకలోని గ్రామీణ స్త్రీల పునరావాసము అనే అంశంపై పరిశోధనలు చేసి సిద్ధాంతవ్యాసం వ్రాసి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి 2008లో ఎ.పి.జె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను తీసుకుంది. ఆ విధంగా భారతీయ సినీ పరిశ్రమలో థీసిస్ వ్రాసి డాక్టరేట్ను స్వీకరించిన ఏకైక నటిగా పేరుగడించింది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి కోశాధికారిణిగా, అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది.
పర్సనల్ లైఫ్...గురించి
జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ ని వివాహం చేసుకుంది. ఇతడు అనేక తెలుగు చిత్రాల్లో విలన్ గా బాగా పాపులర్. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్ గా నటించడం గమనార్హం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్ళి చేసుకుంది. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉంది.
జయమాల...పొలిటికల్ గ్రాఫ్
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నటి జయమాలకు కర్ణాటక రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతికశాఖ బాధ్యతలను అప్పగించారు. తొలిసారి ఒక నటికి కర్ణాటక మంత్రి వర్గంలో చోటు దక్కడం విశేషం. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి కూడా సినిమా నేపథ్యం ఉండటం గమనార్హం. అంతేకాదు జయమాల తాజాగా మంత్రి పదవి చేపట్టడం ద్వారా మూడు సరికొత్త రికార్డులు సృష్టించారు. బిల్లావా వర్గం నుంచి తొలిసారి మంత్రి కావడం, చిత్ర పరిశ్రమ నుంచి కర్ణాటక కేబినెట్కు నేరుగా ఎంపిక కావడం, కౌన్సిల్లో కూడా ఈమే ఫ్లోర్ లీడర్ కానుండటమే ఆ ప్రత్యేకతలు. ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్న జయమాల మంత్రి గా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిద్దాం.