పొత్తులపై మెగా బ్రదర్ నాగబాబు స్పష్టత, ఆ విషయంలో వైసీపీకి వార్నింగ్
ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు . ఏపీ రాజకీయాల్లో ఎన్నికలతో అడుగుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ నరసాపురంలో పర్యటించారు. జనసైనికుల్లో భరోసా నింపారు.
జనసేన పోలిట్ బ్యూరో సభ్యుల నియామకం: జేడీ లక్ష్మీనారాయణకు దక్కని చోటు: పార్టీ వీడినట్లేనా
ఏ పార్టీ పొత్తుతో జనసేన ఎన్నికలకు వెళ్ళదని స్పష్టంగా చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు
ఇక ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జనసేన, టీడీపీ పొత్తుల గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నాటికి జగన్, చంద్రబాబులకు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధి చెందుతుందని నాగబాబు అన్నారు. ఇక ఏపీలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.ఏ పార్టీ తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పేశారు. ఇక రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని నాగబాబు పేర్కొన్నారు.
నెలలో వారం రోజుల పాటు నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తానన్న నాగబాబు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన నాగబాబు జనసేన కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. రాబోయే రోజుల్లో నెలలో వారం రోజుల పాటు నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో ఉండేలా చూస్తానని ఆయన జనసేన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా జనసైనికులు పని చేయాలని నాగబాబు వారికి సూచించారు. గత ఎన్నికల్లో ఓటమికి ఏ మాత్రం కుంగిపోవద్దని... రాబోయే రోజులు జనసేనవే అని నాగబాబు వారికి ధైర్యం చెప్పారు.
జనసేన కార్యకర్తలపై వైసీపీ దాడులు సహించేది లేదన్న నాగబాబు
జనసేన పార్టీ సైనికుల్ని వైసీపీ నేతలు వేధిస్తున్నారని, అలా వేధిస్తే సహించేది లేని నాగబాబు హెచ్చరించారు.ఇకపోతే జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అందుకే కమిటీలు వేసి పార్టీ బలోపెతంపై దృష్టి పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూడటంతో ఇకపై రాబోయే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ పోలిట్ బ్యూరో కమిటిని నియమించారు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న జనసేన ఒంటరి ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు నాగబాబు.