మంత్రి రోజా పై నాగబాబు కౌంటర్లు - బీజేపీతో పొత్తుపై క్లారిటీ..!!
మంత్రి రోజా పై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి కౌంటర్లు వేసారు. జబర్ధస్థ్ షో లో జడ్జిలుగా వ్యవహరించిన రోజా - నాగబాబు ఇద్దరూ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధులుగా మారారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి పైన మరొకరు విమర్శలకో కౌంటర్ చేస్తున్నారు. రోజా శాఖల గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రణస్థలం సభలో పవన్ చేసిన వ్యాఖ్యల పైన రోజా తీవ్రంగా స్పందించారు. పవన్ కు మద్దతుగా జబర్ధస్థ్ ఫేం ఆది చేసిన వ్యాఖ్యలపై రోజా చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు నాగబాబు మరోసారి రోజాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అనంతపురంలో పార్టీ నేతలతో నాగబాబు సమావేశం అయ్యారు. వైసీపీ ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని.. వైసీపీగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. పొత్తుల గురించి పార్టీ అధినేతగా పవన్ ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా అన్ని విషయాలను పార్టీ అధ్యక్షుడే చెబుతారని నాగబాబు వివరించారు. ఇక, మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే తమ స్థాయి తగ్గించుకోవటమేనంటూ నాగాబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అడ్డుకోవటం కోసమే జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకోవటానికి ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని నాగబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగానే హైకోర్టు మొట్టికాయలు వేసిందని నాగబాబు చెప్పుకొచ్చారు.
పవన్ త్వరలో వారాహి ద్వారా రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి పవన్ పూర్తి ప్రకటన చేసారని నాగబాబు చెప్పుకొచ్చారు. పాత్తుల గురించి చెప్పాల్సిన సమయంలోనే ప్రకటన ఉంటుందన్నారు. తాము బీజేపీతో కలిసే ఉన్నామని నాగాబాబు చెప్పారు. ఇదే సమయంలో నాగబాబు ఏపీలో జనసేన బలం పెరిగిందంటూ చెప్పుకొచ్చిన లెక్కలు రాజకీయంగా కొత్త చర్చకు కారణమయ్యాయి. రేపు (24వ తేదీ)న పవన్ కల్యాణ్ తన వారాహి కి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేయించనున్నారు. ఆ తరువాత పార్టీ నేతలతోనూ సమావేశం ఏర్పాటు చేసారు. మార్చి తరువాత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక.. ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపైన మంత్రి రోజా ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.