మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..! పొలిటికల్ సినారియోపై తనదైన శైలిలో స్పందిస్తున్న మెగాస్టార్..!!
హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజల ఆలోచనా విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం బలంగా ఉండాలే గాని ఎప్పటికైనా ఆ ధ్యేయం నెరవేరక మానదు. రాననుకున్నారా..? రాలేననుకున్నారా..? రావడంలో కాస్త ఆలస్యం అవ్వొచ్చు.. కాని రావడం మాత్రం పక్కా.. అనే డైలాగులతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజానికాన్ని ఉర్రూతలూగించారు. ఏ క్షణాన ఆ డైలాగులు పలికారో గాని చిరంజీవి రాజకీయ భవితకు అతికినట్టు సరిపోయాయి. తాన రాజకీయ జీవితానికి స్వల్ప విరామాన్నిచ్చిన మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
రాజకీయాలవైపు చిరంజీవి..
ఒక సారి విఫలమైనంత మాత్రాన లక్ష్యాన్ని విడిచిపెట్టాలని ఎక్కడా లేదు. కొంత విరామం ఇచ్చి, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని, మళ్లీ ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా లక్ష్యాన్ని ఛేదించేందుకు ముందకు అడుగు వేసే వాడే నిజమైన యోధుడుగా అభివర్ణిస్తుంటారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ రంగమైనా సంపూర్ణ పరిపక్వత చూపించక పోతే కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక తప్పదు. వాటన్నిటిని అధిగమించి, రెట్టింపు ఉత్సాహాంతో, నూతన ఆలోచనా విధానంతో ముందడుగు వేస్తే విజయం తప్పదనే ఉదాహరణలు చరిత్రలో ఎన్నో ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో జరిగిన తప్పులే గుణపాఠాలు..
సమకాలీన రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తున్నారు. సామాజిక అంశాల పట్ల తనకున్న బాద్యతను ఆ స్పందన ద్వారా తెలియజేస్తున్నారు మెగాస్టార్. మహిళల భద్రత కోసం ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తనదైన శైలిలో ప్రశంసించారు మెగాస్టార్ చిరంజీవి. అంటే రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను సూక్ష్మంగా పరిశీలించి, ఆచితూచి స్పందిస్తున్నారు చిరంజీవి. దీని ద్వారా రాజకీయాల్లో తాను చేయాల్సింది ఇంకా ఏదో ఉందని, అందుకోసం తన తపన చల్లారలేదనే సంకేతాలు ఇస్తున్నారు మెగాస్టార్. గతంలో జరిగిన అంశాలను పక్కన పెడితే భవిష్యత్తులో ఎంత దూకుడుగా వ్యవహరించబోతున్నామనే దిశగా చిరంజీవి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
గత పొరపాట్లకు తావు లేదు..
ప్రస్తుతం చిరంజీవి కమిట్ అయిన సినిమాలు పూర్తవ్వడానికి మరో రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. తెలంగాణలోగాని, ఏపిలో గాని మళ్లీ సాధారణ ఎన్నికలకు కూడా అంతే సమయం ఉంది. ఈలోపు చిరంజీవి తన సినిమాలు పూర్తి చేసి ఫుల్ రిఛార్జ్ తో ఎన్నికలకు ఓ సంవత్సరం ముందే రాజకీయాల్లో ప్రవేశించాలని పధకం రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారిన రాజకీయాలతో పాటు, మారిన జనరేషన్ కు తగ్గట్టుగా చిరంజీవి రాజకీయ భవితను తీర్చి దిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. పద్నాలుగేళ్ల క్రితం ఓ లెక్క ఇప్పుడో లెక్క అనే రీతిలో చిరంజీవి పునరాగమనం ఉండబోతున్నట్టు అత్యంత సన్నిహితుల మధ్య చర్చ జరుగుతోంది.
సామాజిక బాధ్యతగా స్పందించిన చిరు..
కాశీకి పోయాడు మళ్లీ కనిపించడులే అనుకున్నారా.. ? అనే ఇంద్ర సినిమాలోని డైలాగ్ తెలుగు ప్రజలకు మరోసారి వినిపించేందుకు సై సై అంటున్నారు మెగాస్టార్. అందుకోసం రెండు తెలుగు రాష్టాల్లో జరుగుతున్న సామాజిక అంశాల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో నెమ్మదిగా రాజకీయంగా స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పాలన్నది మెగాస్టార్ అభిమతంగా తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లకు ఎట్టి పరిస్ధితుల్లో తావివ్వకుండా సైనికుల్లాంటి ముఖ్య శ్రేణులతో వంద సునామీల బలంతో మళ్లీ రాజకీయ తెరమీదకు చిరంజీవి రాబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం వ్యూహాత్మకంగా మెగాస్టార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నూతనోత్తేజంతో, నిత్య నూతనంగా పునఃప్రవేశిస్తున్న మెగాస్టార్ కి రాజకీయ పరిణామాలు ఎంత వరకు సై సై అంటాయో చూడాలి.