కరోనా కష్టాల్లో మెగాస్టార్ మేలుకొలుపు..! వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న చిరంజీవి..!!
హైదరాబాద్/అమరావతి : మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలుగు ప్రజలు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞత చాటుకుంటున్నారు. ప్రణాంతక మహమ్మారి కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ దాని బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు మెగాస్టార్. అంతే కాకుండా లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ప్రాణాలకు తెగించి విధిలు నిర్వహిస్తున్న డాక్టర్లు, మున్సిపల్ సిబ్బందిని ఆయన ప్రసంశలతో ముంచెత్తారు. ముఖ్యంగా క్లిష్ట సమయంలో పోలీసు వ్యవస్థ అత్యద్బుతంగా పనిచేస్తోందని, వారికి హాట్సాఫ్ అంటూ పోలీసుల సేవలను కొనియాడారు చిరంజీవి. మెగాస్టార్ ప్రకటనల పట్ల రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి స్పందించారు. పోలీసుల సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలంటూ పేర్కొనడం వైరల్ గా మారింది.
మెగాస్టార్ చొరవ.. శభాష్ అంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు..
లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్న వేళ ప్రజలు ఇబ్బందుల బారిన పడకుండా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అసలు కరోనా మహమ్మారిని తరిమికొట్టే అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఆయన పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు విధానాలను కూడా చిరంజీవి తారా స్థాయిలో మెచ్చుకుంటున్నారు.
డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది సేవలు భేష్.. స్వీయ నియంత్రణ పాటించాలని సైరా విజ్ఞప్తి..
అంతే కాకుండా ప్రజలు కరోనా బారిన పడకుండా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తున్నారు చిరంజీవి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు వంద శాతం స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు. కరోనా వైరస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తూనే, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు మెగాస్టార్. ఐతే ప్రభుత్వాలు, పోలీసులు ఎంత చెప్పినా తమ అభిమాన హీరో చెప్పే విధానంలో ఉన్న కిక్కు వేరబ్బా అనుకునే అభిమానులకు సైరా నర్సింహారెడ్డి ఇస్తున్న సూచనలు తెగ నచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కరోనా కష్టాల్లో ఏ హీరో చూపని తెగింపు చిరంజీవి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ అమలులో పోలీసుల పాత్ర అత్యద్బుతం.. ప్రతిస్పందించిన డిజిపీ..
తాజాగా లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేయడంలో గాని, ప్రజలను బయటకు రాకుండా నియంత్రించడంలో గాని పోలీసులు చూపిస్తున్న తెగువను చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఉండకపోతే కరోనా వైరస్ ను ఇంత పటిష్టంగా నియంత్రించి ఉండి ఉండేవాళ్లం కాదని చిరంజీవి పేర్కొంటున్నారు. అందులో భాగంగానే 24గంటలూ విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను చిరంజీవి ప్రసంశిస్తున్నారు. చిరంజీవి సూక్ష్మదృష్టి పట్ల తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి మంత్రముగ్దులైనట్టు తెలుస్తోంది. అందుకే పోలీసు సేవలను గుర్తించడమే కాకుండా అదే అంశాన్ని ప్రజలకు వివరించినందుకు చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర డిజీపి.
Recommended Video
మెగాస్టార్ మార్క్ చాటుకుంటున్న చిరు.. అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న సైరా...
తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నా మెగాస్టార్ చిరంజీవి మాత్రం పెద్దన్న పాత్ర పోషిస్తుండం హర్షించదగ్గ పరిణామంగా చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపధ్యంలో జీవనోపాది కోల్పోయిన సిని కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆర్థికంగా వారిని ఆదుకుంటున్న చిరంజీవి ఔదార్యానికి యావత్ సినీ వర్గాలనుండి ప్రశంసలు అందుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం పట్ల చిరంజీవి పరితపిస్తున్న తీరు అద్బుతంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండేందుకు మీడియా, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న విజ్ఞప్తులు చైతన్యవంతంగా ఉండటమే కాకుండా ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది.