మెగాస్టార్ చిరంజీవి...మమ్మల్ని పట్టించుకోవడం లేదు:ఉయ్యాలవాడ వంశీకుల ఆవేదన
Recommended Video
హైదరాబాద్:బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం సైరా పేరుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో వివాదం చుట్టుముట్టింది.
తమ వంశానికి పేరు తెచ్చిపెట్టిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తూ తమను కనీసం గుర్తించకపోవడం...సంప్రదించకపోవడం అన్యాయమని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా...ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తమను ఏమాత్రం పట్టించుకోకపోవడం సరికాదని వారు వాపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాగా ఈ సినిమా వారి సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ మీద నిర్మితమవుతోంది. ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్...పైగా ఇటీవలికాలంలో ఈ సినిమాను కొన్ని వివాదాలు చుట్టుముట్టుతుండటంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరింత చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ సినిమా కథానాయకుడి ఇంటి సెట్ రెవిన్యూ అధికారులు కూల్చేయడంతో రెండు రోజుల క్రితం వార్తల్లోకెక్కిన ఈ సినిమాను తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. అయితే ఈసారి ఈ వివాదం ఉయ్యాలవాడ వంశీకుల నుంచి ఎదురవుతుండటం విశేషం. తమ వంశ పురుషుడి వీరోచిత గాథను తెరకెక్కిస్తూ ఈ సినిమాకు కర్త,కర్మ,క్రియగా వ్యవహరిస్తున్న మెగా కుటుంబీకులెవరూ తమను నామమాత్రంగానైనా గుర్తించకపోవడంపై ఉయ్యాలవాడ కుటుంబీకులు మీడియాను ఆశ్రయించడమే ఈ వివాదానికి మూలం.
ఉయ్యాలవాడ వంశీకుల వాదన ఇది... "మా రక్తాన్ని తీసుకువెళుతున్నారు...కానీ ఆ గుర్తింపు మాకు దక్కడం లేదు...అదే మా ఆవేదన. మా చరిత్రను సినిమా తీస్తున్నందుకు బాధ లేదు. కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు...అదే బాధ"...అంటూ వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు గుర్తింపు కోసం కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... అయినా చిరంజీవిగానీ, నిర్మాత రాంచరణ్ గానీ తమను అసలు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
మధ్యలో కొందరు చిరంజీవి గారు వస్తారు...మీతో మాట్లాడతారు అంటూ ఆశపెట్టి...మరోవైపు వాళ్ల పని వాళ్లు చేసుకు పోతున్నారని వారు చెబుతున్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో జరిగిన చర్చా కార్యక్రమంలో ఉయ్యాలవాడ వంశీకులు తమ ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు.