చిరుని పిలవలేదు, నెత్తిన ఎక్కించుకోను: బాలకృష్ణ, చేరికలపై తడబాటు
విజయవాడ: తన నియోజకవర్గంలో రూ. 4 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలకు సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవిని పిలవలేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని క్యాంపు ఆఫీసులో సీఎం చంద్రబాబు నాయుడిని బాలకృష్ణ కలిశారు.
లేపాక్షి ఉత్సవాలకు రావాల్సిందిగా చంద్రబాబు నాయుడును బాలకృష్ణ ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలువలేదని అన్నారు. నేను ఎవరిని నెత్తిన ఎక్కించుకోనని, నా నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం లేదన్నారు.
ఇండస్ట్రీ నుంచి తాను ఎవరినీ పిలవలేదని చెప్పిన ఆయన నా పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లతోనే కలిసి ప్రయాణిస్తానని అన్నారు. లేపాక్షి ఉత్సవాలు నా కష్టార్జితమని, ఎవరిని పిలవాలో ఎవరిని పిలకూడదో తనకు తెలుసనని అన్నారు.
ఉత్సవాలకు రకరకాల మనుషులు వస్తుంటారని, నేను నా పద్ధతిలోనే వెళతానని అన్నారు. డిక్టేటర్ పద్ధతిలోనే వెళతానని చమత్కరించారు. టీడీపీలోకి వైసీపీ చెందిన ఎమ్మెల్యేల వలసలపై కూడా స్పందించారు. ఏపీలో అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు.
వారు మాతో కలవాలని అనుకోవటం ఆరోగ్యకర వాతావరణమని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వారి విచక్షణ మేరకే పార్టీలో చేరుతున్నారని ఎవరూ వారిని లాక్కోవటం లేదన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని చెప్పారు. అంతలోనే మాటమార్చి వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పారు.
కాగా, లేపాక్షి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. ఫిబ్రవరి 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలోని లేపాక్షి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది.