టాలీవుడ్పై జగన్ టార్గెట్: ఫోన్ చేసిన మెగాస్టార్: ఆ పని చేసినందుకు థాంక్స్: మళ్లీ భేటీ
అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండురోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు. కొద్దిరోజుల కిందటే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ అయిన ఆయన మరో ముందడుగు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదివారం ఫోన్ చేశారు.
షూటింగుల అనుమతికి సింగిల్ విండో..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల సడలింపుల్లో భాగంగా.. ఏపీలో సినిమా షూటింగులను నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులకు అవసరమైన అనుమతులను జారీ చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ రెండు చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఙతగా చిరంజీవి ఈ ఉదయం వైఎస్ జగన్కు ఫోన్ చేశారు. కృతజ్ఙతలు తెలిపారు.
తాడేపల్లికి రావాలంటూ జగన్ ఆహ్వానం..
ఈ సందర్భంగా వారి మధ్య పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 20 నిమిషాల పాటు వారిద్దరి మధ్య సంభాషణ కొనసాగినట్లు చెబుతున్నారు. విశాఖపట్నాన్ని సినిమా పరిశ్రమ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉందని ఈ సందర్భంగా వైఎస్ జగన్.. చిరంజీవికి వివరించారని అంటున్నారు. ఇదే విషయంపై చర్చించడానికి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి రావాలని సూచించారు.
24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో జగన్తో భేటీ..
చిత్ర పరిశ్రమ ఏపీపై దృష్టి కేంద్రీకరించేలా చిరంజీవి కూడా కొన్ని సూచనలు చేయగా.. వాటన్నింటిపైనా సమగ్రంగా చర్చిద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై కూలంకషంగా చర్చించడానికి చిరంజీవి త్వరలోనే తాడేపల్లికి వెళ్లనున్నారు. 24 క్రాఫ్ట్స్కు చెందిన ప్రతినిధులతో కలిసి త్వరలోనే తాను వైఎస్ జగన్ను కలుస్తానని చిరంజీవి.. స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
సినీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు..
నిజానికి- తెలుగు చిత్ర పరిశ్రమతో వైఎస్ జగన్కు సత్సంబంధాలే ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు వంటి కొందరు నటులు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారు. క్యారెక్టర్ నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనీ లేదు. వైఎస్ జగన్కు డైహార్డ్ ఫ్యాన్గా ముద్ర ఉంది ఆయనకు. ఎన్నికల సమయంలో మహేష్బాబు సైతం వైఎస్ జగన్ గెలుపోటముల గురించి ఆరా తీశారంటూ పోసాని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే మహేష్బాబు భార్య నమ్రతా.. వైఎస్ జగన్ భార్య భారతిని స్వయంగా కలిశారు. ఇలాంటి పరిణామాల మధ్య మెగాస్టార్ మరోసారి వైఎస్ జగన్తో భేటీ కాబోతుండటం ఆసక్తి రేపుతోంది.