video : రఘువీరాకు చిరంజీవి హ్యాట్సాఫ్- నీలకంఠాపురంలో ఆధ్యాత్మిక సేవపై ప్రశంసలు
ఏపీలో ఒకప్పుడు రాష్ట్రమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరారెడ్డి తాజాగా తన సొంత జిల్లా అనంతపురంలోని మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఆలయాల నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం తాజాగా పూర్తయింది. దీంతో ఆలయాల ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఆహ్వనించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు చిరంజీవితో ఉన్న స్నేహంతో ఆయన ఆహ్వానం పంపినా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాలేకపోతున్న చిరంజీవి.. ఆయన్ను ప్రశంసిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
రఘువీరారెడ్డి గురించి మాట్లాడిన చిరంజీవి.. నా రాజకీయ ప్రస్దానంలో తక్కువ సమయంలోనే ఆప్తులైన వ్యక్తి రఘువీరారెడ్డి అని, ఉన్నత వ్యక్తిత్వం, ముక్కుసూటితనం, నిర్భీతి, సామాన్యప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. నా పట్ల చూపించే ఆత్మీయత, వాత్సల్యం ప్రజాజీవితంలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారనేది నా స్వానుభవం అన్నారు. ఇంద్ర సినిమాలో సీమకు నీళ్లు తేవాలని తాను నటించానని, దాన్ని నిజం చేసిన నిజమైన హీరో రఘువీరారెడ్డి అని చిరంజీవి కొనియాడారు. సీమకు ఏం చేశారంటే దాహం దాహం అంటున్న సీమ గొంతు తడిపారు. తనను నాయకుడ్ని చేసిన తన వారి రుణం తీర్చుకున్నారు.ప్రస్తుతం నా రాజకీయ స్తబ్దతతో సినిమాలు చేసుకుంటుంటే ఆయన రైతు అవతారం ఎత్తాడని చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.
Recommended Video
రఘవీరారెడ్డి తన జీవితానికి ఓ అర్దం, పరమార్ధం కల్పించుకున్నారు.హ్యాట్సాఫ్ అంటూ చిరంజీవి ఆయన్ను ఆకాశానికెత్తేశారు.దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఆయనలో ఎక్కువ అని, జీర్ణావస్ధలో ఉన్నదేవాలయాల పునర్మిర్మాణం చేయాలన్న బృహత్కార్యం చేపట్టడం మంచి పరిణామం అని అన్నారు. నీలకంఠాపురం ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని ఆయన ఏడాది క్రితం కోరారని, త్వరలో పరిస్ధితులు చక్కబడ్డాక తాను తప్పకుండా వెళ్తానని చిరంజీవి వెల్లడించారు.