చంద్రబాబు కంటే ముందు బీజేపీ జగన్నే కలిసింది: మేకపాటి, బాబుది శివప్రసాద్ను మించిన డ్రామా
న్యూఢిల్లీ: 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు కంటే ముందే బీజేపీ తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం చెప్పారు. జగన్ వద్దని చెప్పిన తర్వాతే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని తెలిపారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ హవాను బట్టి చంద్రబాబు ఫ్రెండ్ షిప్ మూడ్ మారుతుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు హామీల విషయంలో అన్యాయం చేశారని చెప్పడం విడ్డూరమన్నారు. పోలవరం ప్రాజెక్టును తనకు అప్పగించమని, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వమని చెప్పారని, హోదాను మాత్రం నిన్నటి వరకు అడగలేదన్నారు.
మోడీ గ్రాఫ్ పెరిగితే మళ్లీ బీజేపీ వద్దకు
పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ సీట్లు పెంచాలని చంద్రబాబు పదేపదే ఇన్నాళ్లు అడిగారని మేకపాటి అన్నారు. తనకు రాజకీయంగా లాభం కోసమే చూసుకున్నారని చెప్పారు. అందుకే ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారన్నారు. మోడీ ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చినా చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారన్నారు. ఎందుకంటే మోడీ గ్రాఫ్ తగ్గిందన్నారు. ఇప్పుడు మోడీ గ్రాఫ్ పెరిగితే తిరిగి బీజేపీ వద్దకు వెళ్తారన్నారు. వాజపేయినే సపోర్ట్ చేసి పొరపాటు చేశానని చెప్పిన చంద్రబాబు మోడీని అనడని ఎలా భావిస్తామన్నారు. మళ్లీ మోడీ గాలి పెరిగితే యూటర్న్ తీసుకుంటారన్నారు.
వారికే మా మద్దతు
చంద్రబాబు గొప్ప మేథావి కావొచ్చునని, కానీ రాజకీయ లాభం చూసుకుంటారని మేకపాటి అన్నారు. మోడీ గ్రాఫ్ను బట్టి చంద్రబాబు మూడ్ మారుతుందన్నారు. వైసీపీకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు మించి ఏదీ ఎక్కువ కాదన్నారు. నాలుగు ఏళ్ల పాటు బీజేపీతో అంటకాగి, ఇప్పుడు తమను చంద్రబాబు విమర్శిస్తున్నారన్నారు. ఈ రోజు కాకమ్మ కథలు, కబుర్లు చెబితే ప్రజలు నమ్మరని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి తాము మద్దతిస్తామని మేకపాటి చెప్పారు.
చంద్రబాబు ఢిల్లీకి వస్తే భయపడి
చంద్రబాబు వంటి మేథావి ఢిల్లీకి వస్తే మోడీ, కేంద్రం భయపడి అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధమవుతుందని భావించామని మరో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీకి న్యాయం కోసం తమతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని, 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. తాము మార్చి 16న అవిశ్వాసం నోటీసు ఇచ్చామని, జగన్ కూడా అందరికీ లేఖలు రాశారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఎవరినైతే కలుస్తున్నారో తాము అప్పుడే కలిశామన్నారు.
జైల్లో పెట్టించారుగా
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు గతంలో ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తే అరెస్టు చేసి జైల్లో పెట్టించారని, కానీ ఇప్పుడు వారి వెంటే చంద్రబాబు పడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏపీకి న్యాయం కోసం తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు.
చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదు
చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేకపోవడం వల్ల ప్రత్యేక హోదా రావడం లేదని ఎంపీ వరప్రసాద్ అన్నారు. 29సార్లు ఢిల్లీకి వచ్చి ఏమీ సాధించని చంద్రబాబు ఇప్పుడు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ను ఏవిధంగా ముంచారో, తమ పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో చూశాక ఆయన పార్లమెంటు మెట్లు మొక్కుతుంటే అందరూ నవ్వుతున్నారని అభిప్రాయపడ్డారు. బాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే వైసీపీ నేతలను లాక్కుంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికే మేం అన్ని పార్టీల మద్దతు సంపాదించామని చంద్రబాబు ఢిల్లీకి వచ్చి చేసిందేమిటన్నారు.
నాడు మోడీ, నేడు చంద్రబాబు
నాడు మోడీ పార్లమెంటు మెట్లను మొక్కారని, ఇప్పుడు చంద్రబాబు అదే విధంగా చేశారని, దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ మంచి నటుడు అని, చంద్రబాబును చూస్తుంటే ఆయనను మించిన డ్రామా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. టీడీపీ చీఫ్ ట్రిక్స్కు పాల్పడుతోందని, విజయ సాయి రెడ్డిని, జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి, చీఫ్ పాలిటిక్స్ పక్కన పెట్టి కలిసి రావాలన్నారు.