దొంగనాటకాలు సాగనీయం: చంద్రబాబుకు వైసీపీ హెచ్చరిక, ‘మాట మార్చనిది జగన్ ఒక్కరే’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబేనని విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారని మేకపాటి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు లేఖ రాసి చంద్రబాబు కారణమయ్యారని అన్నారు. విభజన వల్ల ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని వ్యాఖ్యానించారు.
జగన్ ఒక్కరే
విభజన సమయంలో పోలవరం, హోదా, రైల్వే జోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వైయస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం వంటి హామీలిచ్చి టీడీపీ, బీజేపీలు పట్టించుకోవడం లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటి వరకు వైయస్ జగన్ ఒకే మాటపై ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేశారని మేకపాటి తెలిపారు.
చంద్రబాబు ఓటు అడిగే హక్కు లేదు
రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మేకపాటి ప్రశ్నించారు. గత పార్లమెంటు సమావేశాల్లో ఏం సాధించారో చూశామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఏం సాధిస్తారో చూద్దామని మేకపాటి ఎద్దేవా చేశారు. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడులను విభజించకుండా ఏపీని పనిగట్టుకుని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు చాలా వాగ్ధానాలు చేసి మోసం చేశాయని తెలిపారు.
ప్రజలను వంచించారు..
హోదా పేరుతో ప్రజల్ని వంచించిన చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు హోదా కోసం పోరాడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వైయస్ జగన్తోనే సాధ్యమని ఉద్ఘాటించారు.
యూటర్న్ తీసుకుని మోసం చేశారు.. కొత్త నాటకం
హోదా అంశంపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అందర్నీ మోసం చేశాడని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు హోదా కోసం ధర్మ పోరాటం అని కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తొక్కిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు దొంగ నాటకాలు ఇక సాగనీయమని హెచ్చరించారు. రాష్ట్రానికి హోదా రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.