బాబుపై డౌట్, జగన్ని లేకుండా చేస్తే అలా అవుతుందనే, సెల్యూట్ చేస్తా: మేకపాటి
న్యూఢిల్లీ/అమరావతి: 2019 ఎన్నికల్లో తాను గెలవనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద భయం పట్టుకుందని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. 2014లో కూడా చంద్రబాబుకు ఈ భయం పట్టుకుందని, అందుకే బీజేపీ, ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేశారన్నారు. ఏదో అదృష్టం కొద్ది చంద్రబాబు గెలిచారని చెప్పారు.
కొత్త నాయకుడి ప్లాన్ చెప్తా, వైసీపీలో వారిని పక్కనపెట్టండి, సీఎం అవుతారు: జగన్పై శివాజీ
కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్నే తుదముట్టించాలని చూశారని మండిపడ్డారు. జగన్ పైన హత్యాయత్నం జరిగితే చంద్రబాబు చేయాల్సిన పని మొదట ఆ దాడిని ఖండించడం అన్నారు. ఆ తర్వాత జగన్ను విచారించాలి, త్వరగా కోలుకోవాలని ఆశించాలన్నారు. కానీ దాడి జరగగానే చంద్రబాబు, డీజీపీలు బాధ్యత మరిచి మాట్లాడారని, అలాంటి వారు విచారిస్తే నిజాలు బయటకు వస్తాయా అన్నారు.
టీడీపీ నేతల మాటలు చూసి ఉమ్మేస్తున్నారు
మేం అనుకొని ఉంటే జగన్ను ముక్కలు చేసేవాళ్లమని ఓ మంత్రి అంటారని, మరో నేత చిన్న కత్తితో దాడి చేస్తామా అని మాట్లాడారని, వారేమైనా టెర్రరిస్టును అంతమొందించాలనుకుంటున్నారా అని మేకపాటి ప్రశ్నించారు. టీడీపీ నేతల మాటలు చూసి ప్రజలు తూతూ.. అని ఉమ్మేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలు, తెలుగు ప్రజలు, భారత ప్రజలు టీడీపీ నేతల మాటలను గర్హిస్తున్నారన్నారు.
చంద్రబాబు కనీసం ఖండించలేదు
జగన్పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు కనీసం ఖండించలేదని మేకపాటి అన్నారు. తమకు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కనుక విచారణ జరపకుంటే తాము సుప్రీం కోర్టుకు అయినా వెళ్తామని చెప్పారు. జగన్ సానుభూతి కోసం ఈ పని చేయించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, దీనిపై పారదర్శక విచారణ కావాలన్నారు.
జగన్ లేకుంటే వైసీపీ గెలవదనే
వైసీపీలో జగన్ లేకుంటే ఆ పార్టీకి బలం ఉండదని, 2019లో సులభంగా గెలుచుకోవచ్చునని చంద్రబాబు ఈ పనికి పూనుకున్నారని మేకపాటి ఆరోపించారు. వైసీపీలో మరో కీలక నేత లేరని, జగన్ను అంతమొందించాలని చూశారన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు జగన్ ఓ లెక్కనా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చంద్రబాబు ప్రభుత్వంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు.
పరామర్శిస్తే రాష్ట్రంపై దాడి చేసినట్లుగా
తాము కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిసి న్యాయం కోసం విజ్ఞప్తి చేస్తామని మేకపాటి చెప్పారు. జగన్ పైన దాడి జరిగిన ఘటన తెలియగానే పరామర్శించిన కేసీఆర్, పవన్ తదితరులను చంద్రబాబు విమర్శించడం విడ్డూరమన్నారు. వారేదో రాష్ట్రంపై దాడి చేస్తున్నట్లుగా సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు.
చంద్రబాబు అలా చేస్తే సెల్యూట్ చేస్తా
చంద్రబాబుకు దమ్ముంటే ఈ దాడి ఘటనపై సీబీఐ కేసు చేయించాలని మేకపాటి సవాల్ చేశారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ చేయిస్తే, నిజాలు బయటకు వస్తే మీకు సెల్యూట్ చేస్తామని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. జగన్ అభిమాని అయితే అలా దాడి చేస్తారా అన్నారు. నిందితుడు శ్రీనివాస రావును ప్రోత్సహించి, అంతమొందించే ప్రయత్నాలు చంద్రబాబు చేసారని అనుమానిస్తున్నామని, విచారణ జరగకుంటే ఈ పరిణామాలకు చంద్రబాబ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.